వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ అగ్రనాయకత్వం నుండి పిలుపు రావడంతో ఢిల్లీ వెళ్లిన షర్మిలను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ సమక్షంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆమెకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ముందునుండి ఊహాగానాలున్నాయి. ఆ ఊహాగానాలను నిజం చేస్తూ ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తన వైయస్సార్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసినట్లయింది.
వైయస్ షర్మిల ప్రస్థానమిదే…
దివంగత మహానేత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఓదార్పు యాత్రను చేసే ప్రయత్నం చేసారు. కానీ కాంగ్రెస్ అధిష్ఠానం అందుకు ఒప్పుకోకపోవడంతో జగన్ కాంగ్రెస్ తో విభేదించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. దాంతో ఆయనను అనేక కేసుల్లో ఇరికించి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. దాదాపు 16 నెలల పాటు జైలులో నిర్బంధించి ఆయనను కట్టడి చేసేందుకు ప్రయత్నం చేసింది. ఆ సమయంలో అన్నయ్య వదిలిన బాణంగా రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ షర్మిల పాదయాత్ర చేయడం ఒక సంచలనంగా చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తరువాత కొంతకాలం ఆమె రాజకీయంగా స్తబ్దుగా ఉండిపోయింది.
అనంతరం తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి పాదయాత్ర చేయడానికి సంకల్పించిన షర్మిల ఆ క్రమంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకు తన పార్టీని ఎన్నికల బరిలో నిలపలేదు. అప్పటినుండే ఆమె కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయనుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పుడు ఆమె అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ ఊహాగానాలు నిజమయ్యాయి. కాగా కాంగ్రెస్లో షర్మిల చేరిన నేపథ్యంలో ఆమెకు ఏఐసీసీలో పదవి ఇస్తారా లేక ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తారా అనే అంశం ఆసక్తికరంగా మారింది.