మణిపూర్ రాష్ట్రంలో ఘర్షణల కారణంగా లక్షలాది మంది అమాయకులు నష్టపోయారని అల్లకల్లోలంగా మారిన మణిపూర్ రాష్ట్రంలో శాంతి, సామరస్యం తిరిగి తీసుకొస్తామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. భారత్ జోడో న్యాయ్ యాత్ర ప్రారంభించేందుకు మణిపూర్ వెళ్లిన రాహుల్ గాంధీకి కాంగ్రెస్ మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. ఇంఫాల్ విమానాశ్రయం నుండి నేరుగా ‘ఖోంగ్జోమ్ యుద్ధ స్మారకం’ వద్దకు వెళ్లిన రాహుల్ 1891 ఆంగ్లో- మణిపుర్ యుద్ధంలో అమరులైనవారికి నివాళులర్పించారు.
అనంతరం మణిపూర్లోని థౌబాల్ నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు ఆదివారంరాహుల్ గాంధీ శ్రీకారం చుట్టారు. ఈ యాత్రను మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ప్రారంభించగా మొత్తంగా 110 జిల్లాలు,100 లోక్సభ స్థానాలు, 337 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 67 రోజుల పాటు 6,713 కిలోమీటర్ల మేర భారత్ జోడో న్యాయ్ యాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఏకం చేయాలన్నదే ఈ యాత్ర ఉద్దేశమని సమానత్వం, సౌభ్రాతృత్వం, సామరస్యంతో కూడిన న్యూ విజన్ ఆఫ్ ఇండియాను సాధించడం ధ్యేయమని రాహుల్ గాంధీ వెల్లడించారు. బీజేపీ క్షుద్ర రాజకీయాల వల్ల మణిపూర్లో శాంతి, సామరస్యం కనుమరుగు అయ్యాయని మండిపడిన రాహుల్ ప్రజలను నేరుగా కలుసుకొని, వారి సమస్యలు అడిగి తెలుసుకుంటామని తెలిపారు.
కాగా మణిపూర్లోని థౌబాల్ నుంచి ప్రారంభమైన భారత్ జోడో న్యాయ యాత్ర మార్చి 20 లేదా 21న ముంబైలో ముగుస్తుంది. ప్రారంభ కార్యక్రమానికి ఏఐసీసీ చీప్ మల్లికార్జున ఖర్గేతో పాటు ఏఐసీసీ ముఖ్య నేతలు, కాంగ్రెస్ రాష్ట్ర పాలిత సీఎంలు, పీసీసీ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరు కాగా ఏపీ నుంచి రఘువీరారెడ్డి, వైఎస్ షర్మిల హాజరయ్యారు.