ప్రముఖ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలీ నారీమన్ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న నారిమన్ పలు చరిత్రాత్మక కేసుల్లో వాదనలు వినిపించారు. ఆయన 1929 జనవరి 10న బర్మా (ప్రస్తుతం మయన్మార్)లోని యంగూన్లో జన్మించారు. షిమ్లా, ముంబైలో విద్యాభ్యాసం కొనసాగించారు. తండ్రి కోరిక మేరకు సివిల్స్ ఎగ్జామ్స్ వైపు దృష్టి సారించినా, అందుకు ఆర్థిక స్తోమత సహకరించక న్యాయవాద వృత్తి వైపు అడుగులేసారు.
1950లో21 ఏళ్లకే బాంబే హైకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రారంభించి, 1961లో సీనియర్ అడ్వకేట్గా ఎంపికయ్యారు. బాంబే హైకోర్టులో 22 ఏళ్లపాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేసిన అనంతరం, 1972 నుంచి సుప్రీంకోర్టులో పని చేశారు. 1972 నుంచి మూడేళ్లపాటు అదనపు సోలిసిటర్ జనరల్గా పని చేసినా, ఇందిరా గాంధీ తీసుకొచ్చిన ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు.
న్యాయవాద వృత్తిలో ఆయన చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. కాగా ఫాలీ నారీమన్ 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా పనిచేయగా, 1999 నుంచి 2005 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు. 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్గా ఉన్నారు.
ఎన్నో ప్రముఖ కేసులను వాదించిన నారీమన్ కెరీర్ లో భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన యూనియన్ కార్బైడ్ కంపెనీ తరఫున వాదించడం ఓ మచ్చగా నిలిచిపోయింది. నారీమన్ మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఫాలీ ఎస్ నారీమన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం కార్యాలయం ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసింది.