ఐపీఎల్ 2024 లో భాగంగా నిన్న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ టీం రాజస్థాన్ రాయల్స్ కి షాక్ ఇచ్చింది, చివర వరకు ఉత్కంఠగా సాగిన పోరులో 1 పరుగు తేడాతో గెలిచి హైదరాబాద్ సంచలనం సృష్టించింది . సన్ రైజర్స్ హైదరాబాద్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకుంది , పాయింట్ల టేబుల్లో టాప్ లో ఉన్న రాజస్థాన్ రాయల్స్ తో సొంత మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్ మెరుపు హాఫ్ సెంచరీలతో టీమ్ కు భారీ స్కోరు అందించారు.
హైదరాబాద్ ఓపెనర్లు పవర్ ప్లే లో గత మ్యాచ్ ల్లో లాగా దూకుడు ఆట కొనసాగించ లేకపోయారు. అభిషేక్ 12 పరుగులకు ఔట్ అవ్వడం, ఆ తర్వాత వచ్చిన అన్మోల్ప్రీత్ సింగ్ 5 పరుగులకు వెంటనే అవుట్ అవ్వడంతో 35 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది . ఈ దశలో క్రీజులో ఉన్న హెడ్ కు నితీష్ కుమార్ రెడ్డి తోడయ్యాడు. ఇద్దరూ కలిసి నిలదొక్కుకుని మూడో వికెట్ కు 96 పరుగులు జోడించి ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టారు. హెడ్ 44 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్ లతో 58 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న హెడ్.. ఈ మ్యాచ్ లో ఆ స్థాయిలో ఆడలేకపోయినా., ఫర్వాలేదనిపించాడు.
మరోవైపు నితీష్ కుమార్ రెడ్డి మాత్రం బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించాడు. 42 బంతుల్లోనే 8 సిక్స్ లు, 2 ఫోర్లతో 76 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు క్లాసెన్ కూడా చెలరేగాడు. అతడు 19 బంతుల్లోనే 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 42 రన్స్ చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్ కు అజేయంగా 66 పరుగులు జోడించారు. దీంతో హైదరాబాద్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు భారీ స్కోర్ చేసింది
భారీ లక్ష్యచేధనకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ కి మొదటి ఓవర్లలోనే ఊహించని షాక్ తగిలింది ,భువనేశ్వర్ బౌలింగ్ లో ఓపెనర్ జాస్ బట్లర్ గోల్డెన్ డకౌట్ గా పరుగులు ఏమి చేయకుండా వెనుదిరిగారు ఆతరువాత వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ కూడా అదే ఓవర్లో పరుగులు ఏమి చేయకుండా ఔటయ్యాడు . అయితే ఈ దశలో యశస్వి జైస్వాల్ 67 పరుగులు , రియాన్ పరాగ్ 77 పరుగులతో చెలరేగడంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు ఖాయం అనిపించింది.అయితే కీలక దశలో ఈ ఇద్దరినీ ఔట్ చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ గాడిలో పడింది. చివర్లో హిట్ మేయర్ , పావెల్ జట్టుకోసం పోరాడారు , హిట్ మేయర్ 13 పరుగులకు వెనుదిరగకా పావెల్ 27 పరుగులు చేసి చివరి బంతికి ఔటయ్యాడు
రాజస్థాన్ రాయల్స్ గెలవడానికి చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం అయ్యాయి. ఈ దశలో భువనేశ్వర్ బంతిని అందుకున్నాడు. అతడు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి చివరి బంతి వరకూ మ్యాచ్ ను తీసుకొచ్చాడు,సన్ రైజర్స్ ఫీల్డింగ్ లోపాల వల్ల రాయల్స్ చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. అయితే చివరి బంతికి పావెల్ (27) ను ఔట్ చేసి ఒక్క పరుగు తేడాతో సన్ రైజర్స్ హైదరాబాద్ ను భువనేశ్వర్ గెలిపించాడు. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పాయింట్ల పట్టికలో టాప్ 4 లో స్థానం సంపాదించుకుంది.
కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన భువనేశ్వరకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ లభించింది