ఇవాళ జనవరి 26 అనగా భారత గణతంత్ర దినోత్సవం. అలా అనడం కన్నా భారత్ గణతంత్ర దేశం గా ఆవిర్భవించి 74 ఏళ్లు పూర్తి చేసుకుంది అనడం సబబేమో. అసలు ఏమిటీ గణతంత్రం? స్వాతంత్ర్యానికి, గణతంత్రానికి తేడా ఏంటీ? చాలా మందికి అర్థం కానీ, తేడా తెలీని బ్రహ్మ పదార్ధం. ముఖ్యంగా ఈనాటి యువతకి..
భారతదేశానికి 1947 ఆగస్ట్ 15 న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించింది. కానీ మనం గణతంత్ర దేశం గా ఆవిర్భవించింది మాత్రం జనవరి 26 1950 నాడు. తేడా ఏంటి?
స్వాతంత్ర్యమనేది వ్యక్తిగత అంశం, వ్యక్తి స్వేచ్ఛకి సంబంధించింది అది వ్యక్తి ఉన్నతికి తోడ్పడే అంశం, సొంత ఆలోచన, సొంత నిర్ణయం, స్వేచ్ఛగా జీవించే హక్కు. అయితే ఒక దేశానికి సంబంధించినంత వరకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాల కన్నా దాని గణతంత్ర హోదానే గొప్పది అవుతుంది..
అదేంటీ 200 ఏళ్లు పరాయి పాలనలో ఉండి మన స్వాతంత్ర్య సమరయోధులు అంతా కష్టపడింది స్వాతంత్ర్యం కోసమే కదా అనుకోవచ్చు. నిజమే స్వాతంత్ర్యం కోసమే. రెండో ప్రపంచయుద్ధం ఆరంభం అయ్యేవరకు మన జాతీయ నాయకులు కేవలం సొంత పాలననే కోరారు దాన్ని డొమినియన్ స్టేటస్ అన్నారు అంటే: పాలన మొత్తం మనమే చేసుకుంటాం మనల్ని మనమే పాలించుకుంటాం అని అప్పటికి మనకది చాలనుకున్నారు. తర్వాత 1942 లో క్రిప్స్ ప్రణాళిక ద్వారా భారత్ కి డొమీనియన్ స్టేటస్ ఇస్తాం అని ఒప్పుకున్నా దాన్ని గాంధీ, కాంగ్రేస్ పూర్తిగా వ్యతిరేకించారు కారణం భారత్ కి కావల్సింది డొమీనియన్ స్టేటస్ కాదు పూర్తి స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు అని.
ఇక్కడ మనకి డొమినియన్ స్టేటస్ అంటే ఏమిటో అర్థం అవ్వాలి: పాలన మొత్తం సొంతగా భారతీయులే చేసుకోవచ్చు కానీ భారత్ బ్రిటిష్ రాజ్య చక్రం లో అంతర్భాగం గా ఉంటుంది అంటే మన దేశ అధినేతగా బ్రిటన్ రాజు లేదా రాణి ఉంటారు. అంటే మనం ఏ చట్టం చేసినా తుది సంతకం బ్రిటన్ రాజు లేదా రాణి చేయాల్సి ఉంటుంది. రాజ్యాంగ అధినేతగా వారుంటారు ఉదాహరణ కి ఇప్పుడు న్యూజీలాండ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు స్వతంత్ర దేశాలైనప్పటికీ వాటి పార్లమెంట్ చేసే చట్టాలపై తుది సంతకం కోసం బ్రిటన్ లోని బర్మింగ్ హామ్ ప్యాలెస్ కి పంపాల్సిందే..
అదే గణతంత్రం దేశం గా ఉంటే, రాజ్యాంగ అధినేతగా ఒక కుటుంబం నుండో, లేక ఒక తెగ నుండో వారసత్వంగా ఉండరు. ప్రజలే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వారి రాజ్యంగాధినేతని నిర్ణీత కాలానికే ఎన్నుకుంటారు. అంటే ప్రజలే దేశ అధినేతని నిర్ణయిస్తారు. అయితే ఇందులో గొప్ప ఏముంది? ఎవరు ఉంటే ఏముంది మన దేశంలో రాష్ట్రపతి రాజ్యాంగ అధినేత అయినా అధికారాలు అన్నీ ప్రధానమంత్రి మరియు మంత్రిమండలి వీ కదా అనుకోవచ్చు. కానీ మన రాజ్యాంగ అధినేత గా వేరే దేశపు రాజో, రాణో ఉంటే మనం మన భూభాగంపై సార్వభౌమాధికారాన్ని వారికి ఇచ్చినట్లు, మన విదేశీ విధానం వారి విదేశీ విధానానికి అనుకూలంగా ఉండాల్సి వస్తుంది. ఈ నాడు మన దేశం విదేశీ వ్యవహారాల్లో ఇంత స్వతంత్రంగా వ్యవహరిస్తున్నాం అంటే కారణం మనది గణతంత్ర దేశమవ్వడమే..
ఈ దేశానికి వాస్తవ అధినేత, రాజ్యాంగ అధినేత ఇద్దరూ మనం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎన్నుకున్న వారు అవ్వడానికి కారణం మన రాజ్యాంగం.. ఆ రాజ్యాంగం రాసుకోడానికి 1946 నుండి 1949 వరకు సమయం పట్టింది.. అతిపెద్ద లిఖిత రాజ్యాంగం గా 1950-జనవరి 26 న అమలులోకి వచ్చింది. అదే రోజు మన దేశానికి ఎన్నుకోబడిన రాష్ట్రపతి గా బాబూ రాజేంద్రప్రసాద్ గారి పదవీ స్వీకారం తో మనం గణతంత్ర దేశం గా ఆవిర్భవించాం..
స్వాతంత్ర్య అనగా స్వపరిపాలన అయితే గణతంత్రమనగా, రాజకీయ సార్వభౌమాధికారం ప్రజల్లో ఉండటం, రాజ్యంలో ఎటువంటి ప్రత్యేక హక్కులు కలిగిన వర్గం లేకపోవడం ముఖ్యంగా దేశం సార్వభౌమాధికారం.. విదేశాల్లో From Republic of India అని గర్వంగా పరిచయం చేసుకోగలగడం..
మనం ఎవడికీ సామంతులం కాదు అని గట్టిగా అరిచి చెప్పుకోగలగడం..
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
జై హింద్..