లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే బాధ్యతలు నిర్వర్తిస్తుండడం గమనార్హం. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ ఆయనను మూడు రోజుల క్రితం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జైలు నుంచే పాలన సాగిస్తారని ఆప్ ప్రకటించింది. తాజాగా ఆయన సీఎం హోదాలో జైలు నుండి తొలి ఉత్తర్వును జారీ చేయడం విశేషం.
ఢిల్లీలో తాగునీటి సరఫరాకు సంబంధించిన ఉత్తర్వును కేజ్రీవాల్ జల వనరుల శాఖ మంత్రి అతిషికి పంపారు. ప్రస్తుతం వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఢిల్లీలో నీటి కొరత లేకుండా చూడాలని ఏయే ప్రాంతాల్లో నీటి సమస్య ఉందో అక్కడ సరిపడా వాటర్ ట్యాంక్లను అందుబాటులో ఉంచాలని కేజ్రీవాల్ ఆదేశించినట్లు మీడియా సమావేశంలో మంత్రి అతిషి వెల్లడించారు.జైలులో ఉన్నప్పటికీ తనగురించి ఆలోచించకుండా ఢిల్లీ ప్రజల గురించే కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారని ఆయనను అరెస్ట్ చేసినంత మాత్రాన ఢిల్లీ అభివృద్ధిని ఎవరూ ఆపలేరని మంత్రి అతిషి వ్యాఖ్యానించడంతో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు భావోద్వేగానికి గురయ్యారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మార్చ్ 21 న ఈడీ అధికారులు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారు. ఈ నెల 29వరకూ ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. దీంతో ఆయన జైలునుండి పాలన సాగిస్తారని ఆమ్ ఆద్మీ పార్టీ వెల్లడించింది. కాగా ఇదే కేసులో అరెస్ట్ అయిన తెలంగాణ ఎమ్మెల్సీ బెయిల్ కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఊరట దక్కలేదు. ట్రయల్ కోర్టునే ఆశ్రయించాలని కవితకు సుప్రీం కోర్టు సూచించింది.