హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఉపాధ్యాయుల నియామకం కోసం నిర్వహిస్తున్న డీఎస్సీ 2024 పరీక్షల షెడ్యూల్ ని రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈనెల 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ పరీక్షల నిర్వహించేలా నూతన షెడ్యూల్ ని రూపొందించినట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ శనివారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 6100 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీకి గతంలో నోటిఫికేషన్ విడుదల చేసింది.
డీఎస్సీ కి సంబంధించిన నూతన షెడ్యూల్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు రోజుకు రెండు సెషన్లు చొప్పున 10 సెషన్లలో సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష నిర్వహిస్తారు. ఏప్రిల్ 7న టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులకు ప్రాథమిక పరీక్ష అయిన ఇంగ్లీష్ ప్రొఫెన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. ఏప్రిల్ 13 నుంచి ఏప్రిల్ 30 వరకు స్కూల్ అసిస్టెంట్ టిజిటి పిజిటి ఫిజికల్ డైరెక్టర్ ప్రిన్సిపల్ పరీక్షలు నిర్వహిస్తారు. ఈనెల 20 నుంచి పరీక్ష రాయడానికి అభ్యర్థులకు సెంటర్ ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్స్ ఇస్తారు. మార్చ్ 25 నుంచి అభ్యర్థులు తమ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో చెప్పిన విధంగానే బిఈడి చేసిన అభ్యర్థులు సెకండరీ గ్రేట్ టీచర్ పోస్టులకి అర్హులు కారని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో గతంలో ప్రకటించిన జీవో 11 లో అర్హతలు మారుస్తూ కొత్తగా జీవో 22న గురువారం నుంచి అమల్లోకి తెచ్చారు. అందుకు సంబంధించిన వివరాలను డీఎస్సీ వెబ్సైట్లో చూసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి డీఎస్సీ కి వ్యవధి సమయం తక్కువగా ఉందని కొందరు అభ్యర్థులు హైకోర్టుని ఆశ్రయించారు. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కి డీఎస్సీ పరీక్ష నిర్వహణకు కనీసం 30 రోజులు సమయం ఉండాలని కోరుతూ టెట్ రాసిన అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆ పిటిషన్ ని విచారిస్తూ మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోని రద్దు చేస్తూ , రెండు పరీక్షలకు నాలుగు వారాల సమయం ఉండాలని హైకోర్టు ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ వెల్లడించారు. అభ్యర్థులు పరీక్షలకు సిద్ధం కావడానికి తగినంత సమయం ఇస్తూ నూతన షెడ్యూల్ రూపొందించామని దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.