ప్రముఖ హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అదితిరావు హైదరిల వివాహం అత్యంత సన్నిహితుల సమక్షంలో ఘనంగా జరిగింది. తెలంగాణలోని వనపర్తి జిల్లాలోని శ్రీరంగనాయకస్వామి టెంపుల్ ఈ పెళ్లికి వేదికగా మారింది. వనపర్తి సంస్థానాధీశులు కట్టించిన ఆలయంలో పూర్తి ఆంక్షల మధ్య సిద్దార్థ్- అదితి పెళ్లి జరగడం గమనార్హం. కాగా వనపర్తి సంస్థానాధీశుల వారసుల్లోఅదితిరావు హైదరి కూడా ఒకరు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
బాయ్స్ సినిమాతో హీరోగా పరిచయమైన సిద్దార్ధ్ నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు లాంటి చిత్రాలతో అనతికాలంలోనే లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నాడు. కానీ వరుసగా పరాజయాలు పలకరించడంతో తెలుగులో ప్రాభవం కోల్పోయాడు. కానీ తెలుగులో అజయ్ భూపతి దర్శకత్వంలో మహా సముద్రంతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన సిద్దార్ధ్ కి ఆ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్న అదితి రావు హైదరితో పరిచయం ఏర్పడింది. ‘మహా సముద్రం’ షూటింగ్ సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లు వార్తలు వచ్చాయి. అనంతరం అనేక కార్యక్రమాలకు వీరిద్దరూ జంటగా హాజరవడం ఆ వార్తలకు బలం చేకూర్చింది. తాజాగా వారిద్దరూ వివాహబంధంతో ఒకటవడం విశేషం.
వీరిద్దరికి ఇది రెండో వివాహం కావడం గమనార్హం. సిద్దార్థ్ తన చిన్ననాటి స్నేహితురాలు మేఘనను వివాహం చేసుకున్నా ఇద్దరిమధ్యా విభేదాలు రావడంతో 2007లో ఆమెకు విడాకులు ఇచ్చాడు. మరోవైపు అదితిరావు హైదరి సత్యదీప్ మిశ్రాను పెళ్లాడిన విభేదాల కారణంగా 2012లో అతనికి విడాకులిచ్చింది.