ఒకప్పుడు దేశాన్నే శాసించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దేశంలో తన ఉనికి చాటుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టే స్థాయికి పడిపోయింది. బీజేపీని గద్దె దించాలనే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైన ఇండియా కూటమి ప్రస్తుతం ఇసుక తక్కెడ పేడ తక్కెడగా మారిపోయింది. ఒక్కో పార్టీని, ఒక్కో నాయకులను కలుపుకుని కూటమి కట్టిన కాంగ్రెస్ పార్టీకి మరోవైపు ఆ నాయకులు కూటమి నుండి జారుకోవడం షాకిచ్చే అంశమనే చెప్పాలి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మమతా బెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు లేకుండా తమ పార్టీ ఒంటరిగా పోటీ చేయనుందని ప్రకటించడంతో కాంగ్రెస్కి పెద్ద ఎదురుదెబ్బ తగిలినట్లైంది.
సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు డిమాండ్ చేయడం మమతా బెనర్జీకి నచ్చలేదని సమాచారం. కేవలం రెండు సీట్లు మాత్రమే కేటాయిస్తామని చెప్పడంతో కాంగ్రెస్ అందుకు ఒప్పుకోలేదు. దాంతో తాము ఒంటరిగానే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నామని మమత ప్రకటించారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తమ రాష్టానికి వస్తున్నారని ఈ విషయం గురించి తమకు కనీస సమాచారం ఇవ్వలేదని మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుని దుయ్యబట్టారు. తాము ఒంటరిగా పోటీ చేస్తున్నామని మమత ప్రకటించిన కొద్దిసేపటికే పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్కి షాక్ ఇచ్చింది. తాము కూడా కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తామని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ప్రకటించారు.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినప్పటినుండే కాంగ్రెస్ అంపశయ్యపై చేరిందనేది ఎవ్వరూ కాదనలేని సత్యం. రాష్ట్రాలను చీల్చడంతో ఆగకుండా దివంగత మహానేత వైఎస్ఆర్ కుమారుడైన జగన్ ని జైల్లో ఉంచడంతో పాటు వైఎస్ కుటుంబంలో చీలిక తెచ్చి వైఎస్ వివేకానందరెడ్డిని పులివెందులకు జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మపై పోటీకి దించింది. అనంతరం జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. తాజాగా మరోసారి వైఎస్ కుటుంబాన్ని చీల్చడానికి తెలంగాణాలో వైఎస్సార్టీపీ పెట్టిన జగన్ సోదరి షర్మిలను తమవైపు తిప్పుకుని షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయించి ఆంధ్రప్రదేశ్ పీసీసీ బాధ్యతలు అప్పజెప్పింది. సోనియా చేసిన తప్పులను దేవుడు చూస్తూ ఉంటాడని సీఎం జగన్ చెప్పినట్లు రాష్ట్రాలతో పాటు కుటుంబాలను చీల్చే రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరంగా మారింది. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పశువుల సంతలో కొన్నట్లు కొన్న టీడీపీ 2019 ఎన్నికల్లో 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ మాత్రం ఒక్క ఏపీలోనే కాదు.. దేశం మొత్తంలో ఉనికి చాటుకోవడానికి ప్రాంతీయ పార్టీలతో కూటమి కట్టి పోరాడే స్థాయికి పడిపోయింది. దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో ..