మీ సూపర్ సిక్స్ పై నమ్మకం లేదయ్యా..
‘ప్రజలు పడుతున్న కష్టాలు చూసే సూపర్ సిక్స్ను రూపొందించాం’ తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పెందుర్తిలో జరిగిన శంఖారావం సభలో చెప్పిన మాటలివి. ఇది వినగానే చాలామందికి షాక్ కొట్టి గతంలో చంద్రబాబు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఉంటాయి. ప్రజల కోసం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రారంభించారు. అసలు ఈ కాన్సెప్ట్ నేను ఎప్పుడో డిజైన్ చేసి ఉత్తర్వులు ఇచ్చానని బాబు గతంలో ఒకసారి అన్నారు. ఇక సూపర్ సిక్స్ కూడా ఇలాంటిదే. టీడీపీ ప్రజల్లోకి వెళ్లి రూపొందించింది కాదు. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ తెచ్చిన దానిని బాబు కాపీ కొట్టి ఏపీలో ప్రకటించారు. ఆయన ఏనాడూ సొంతంగా ఆలోచించలేని విజనరీ కదా.. ఈ సిక్స్ను ప్రజలకు చూపించి ఓట్లు దండుకోవాలనేది తండ్రీకొడుకుల ప్లాన్.
2014లో ఎన్నికల సమయంలో చంద్రబాబు సుమారు 600 హామీలిచ్చారు. అందులో ప్రధానమైనవి రైతు, పొదుపు రుణమాఫీ. గద్దెనెక్కాక వాటి గురించి పట్టించుకోలేదు. ఏదో అరకొరగా చేసి మమ అనిపించారు. అది వారి చిత్తశుద్ధి. ఇక వైఎస్ జగన్మోహన్రెడ్డి విషయానికొస్తే పాదయాత్ర సమయంలో ప్రజల కష్టసుఖాలు స్వయంగా తెలుసుకుని ఎన్నికల సమయంలో మేనిఫెస్టో ప్రకటించారు. గెలిచి ముఖ్యమంత్రి అయ్యాక అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. సచివాలయ, వలంటీర్ల వ్యవస్థల ద్వారా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశారు. రూ.2.52 లక్షల కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో వేశారు. ఇందులో రూపాయి అవినీతి లేదు. ఎవరూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగిన దాఖలాల్లేవు. ఇది ఆయన గొప్పతనం. వైఎస్సార్సీపీ అధినేతకు, తెలుగుదేశం తండ్రీకొడులకు మధ్య తేడా ఇదే. జగన్ చెప్పింది చేస్తారు. చంద్రబాబు, లోకేశ్ ఇచ్చిన హామీలను గంగలో కలిపేస్తారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయని సూపర్ సిక్స్ తెచ్చాం. అధికారంలోకి వస్తే అమలు చేస్తామని సభల్లో ఊకదంపుడు ప్రసంగం చేస్తే నమ్మేందుకు ఎవరూ పిచ్చోళ్లు కాదని గుర్తుంచుకోవాలి.
కర్ణాటక, తెలంగాణలో సూపర్ సిక్స్ కాన్సెప్ట్ వల్ల కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ సీఎంలు సిద్ధరామయ్య, రేవంత్రెడ్డి గద్దెనెక్కిన కొద్దిరోజులకే వాటిని పూర్తిగా అమలు చేయలేమని చేతులెత్తేశారు. అంతంత బడ్జెట్ ఎక్కడి నుంచి తేవాలంటూ మీడియా సమావేశాల్లో అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అధికారం కోసం వంద చెబుతాం.. అవన్నీ చేసేస్తామా అనే ధోరణిని ప్రదర్శించారు. మన సోదర రాష్ట్రమైన తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి అయితే కేసీఆర్ మీద పడి ఏడుస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని, ఖాజానా ఖాళీ అయిందని రాగం అందుకున్నారు. సూపర్ సిక్స్ హామీలపై యూటర్న్ తీసుకునేందుకు తన గురువు చంద్రబాబు ఇచ్చిన టిప్స్ ఫాలో అవుతున్నారు. అసలు ఆ కాన్సెప్ట్ తెచ్చిన కాంగ్రెస్సే రెండు రాష్ట్రాల్లో ఏదో మొక్కుబడిగా పథకాలు ప్రవేశపెట్టి చేతులు దులుపుకొంటే.. ఇక కాపీ కొట్టిన తండ్రీకొడుకుల మాటలు ఏ విధంగా నమ్మాలి. జగన్ క్షేత్రస్థాయిలో తిరిగి అధ్యయనం చేసి ఏ వర్గానికి ఏ పథకం కావాలో గుర్తించారు. ఎంతమేర సాయం అవసరమో తెలుసుకున్నారు. సంక్షేమ క్యాలెండర్ ప్రవేశపెట్టి నగదును బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఈ ప్రక్రియలో ఎక్కడా లోపాలకు తావు లేదు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం ఏదో పథకం ద్వారా లబ్ధి పొందింది.
మాటే కదా ఇచ్చేస్తే పోలా అనుకుంటే కాదు.. హామీలను అమలు చేయాలంటే జగన్లా ధైర్యం, చిత్తశుద్ధి, సాయం చేసే గుణం ఉండాలి. తండ్రీకొడులకు ఇవేవీ లేవు. అందుకే కాపీ పథకాలను తమవిగా చెప్పుకొంటూ బతికేస్తున్నారు. చంద్రబాబు జీవితంలో గుర్తుంచుకునే విధంగా ఒక్క పథకమూ లేదు. అదే జగన్ విషయంలో పదుల సంఖ్యలో ఉన్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ ఎప్పుడూ చెబుతూ ఉంటుంది. ఇది అక్షరాల నిజం. దీనికి లబ్ధిదారులే సాక్ష్యం. వాళ్లే ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు.