ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాజీనామా లేఖను పంపించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళల సాధికారత కోసమే పనిచేస్తుందని వ్యాఖ్యానించిన వాసిరెడ్డి పద్మ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల సమయంలో పార్టీ కోసం పనిచేస్తానని మహిళల సాధికారత కోసం జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్తానని వాసిరెడ్డి పద్మ ప్రకటించారు. తనను పోటీ చేయమని పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తానని వెల్లడించిన పద్మ, ఎన్నికల్లో పోటీ చేయడానికి తన రాజీనామాకు సంబంధం లేదని వ్యాఖ్యానించారు. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని కానీ తన స్వస్థలం జగ్గయ్య పేట కాబట్టి అక్కడి నుంచే పోటీ చేస్తాననే అభిప్రాయం ఉండొచ్చని, తనది కమ్మ సామాజిక వర్గం, తన భర్తది ఎస్సీ సామాజిక వర్గం కాబట్టి ఆ కాంబినేషన్లో అధిష్టానం ఆలోచన చేస్తుందని, ఏమో గుర్రం ఎగర వచ్చు.. తనకు సీట్ రావొచ్చు అని వాసిరెడ్డి పద్మ ఆశాభావం వ్యక్తం చేశారు.