ఏపీలో జరగబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో విజయభేరి మ్రోగించేందుకు అధికార వైయస్సార్సీపీ కీలక అడుగులు వేస్తుంది. అందుకు అనుగుణంగానే పలు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలను మార్పు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా గాజువాక సమన్వయ కర్తగా వరికూటి రామచంద్రరావును నియమించింది. దాంతో గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి అసంతృప్తిగా ఉన్నారని ఆయన కుమారుడు తిప్పల దేవన్ రెడ్డి వైయస్సార్సీపీకి రాజీనామా చేయనున్నారని ఓ వర్గం మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కాగా వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డితో భేటీ సందర్భంగా తమపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎమ్మెల్యే నాగిరెడ్డి దేవన్ రెడ్డి ఖండించారు.
ఈ క్రమంలో దేవన్రెడ్డి మాట్లాడుతూ తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. పార్టీకి రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటాను. నా తండ్రి ఎమ్మెల్యేగా ఉన్న పార్టీకి నేనెందుకు రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ గాజువాకలో సమన్వయకర్తను మార్పు చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని రెండు వారాల క్రితమే ఎమ్మెల్యే నాగిరెడ్డికి తెలియజేశాం. మాకు సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా జగన్ ముఖ్యమంత్రిగా కావాలని నాగిరెడ్డి, దేవన్ రెడ్డి చెప్పారు. మంచి అభ్యర్థికి సీటు ఇవ్వమని నాగిరెడ్డి సూచించారు. 175 స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ఏపీలో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులు చేస్తున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. దీంతో పలు సామజిక మాధ్యమాల్లో ఓ వర్గం మీడియాలో జరుగుతున్న ప్రచారానికి బ్రేక్ పడినట్లయింది.