పోలియో నిర్మూలనలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 0 నుంచి 5 సంవత్సరాల వయసు కలిగిన 53,35,519 మంది చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వచ్చే నెల మార్చిలో వేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు తెలిపారు. పల్స్ పోలియోకి సంబంధించి ఏర్పాట్లను పరిశీలనకు ప్రత్యేకమైన టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసాం అని కృష్ణబాబు తెలిపారు కాగా ఈ టాస్క్ ఫోర్స్ సమావేశం నిన్న కృష్ణబాబు అధ్యక్షన వెలగపూడి సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్ 5 లో జరిగింది.
ఈ సందర్భంగా పోలియో రహిత సమాజాన్ని ఏర్పాటు చేయుటకు అందరూ కృషి చేయాలి అని కృష్ణ బాబు తెలిపారు. పోలియోను పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి ఇంట్లో ప్రతి చిన్నారికి తప్పనిసరిగా చుక్కలు వేయించాలి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో కృషి చేస్తునప్పటికీ వేలాది మంది చిన్నారులు పోలియో వ్యాక్సిన్ను అందుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో పక్షవాతానికి ప్రధాన కారణమైన పోలియోను పూర్తి స్థాయిలో నిర్మూలించాలంటే వాక్సిన్ ఒకటే మార్గం అని తెలిపారు. ఇందుకోసం పోలియో చుక్కుల కార్యక్రమంపై అవగాహనా కార్యక్రమలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జె.నివాస్, సెకండరీ హెల్త్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్, ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డాక్టర్ పద్మావతి, అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్, చైల్డ్ హెల్త్, ఇమ్యునైజేషన్ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ అర్జునరావు, పీవో డాక్టర్ ఎల్బిహెచ్ఎస్ దేవి పాల్గొన్నారు.