వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి (వీపీఆర్) రాకతో నెల్లూరు జిల్లాలో టికెట్ల లెక్కలు మారిపోతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేసి పాతవారిని దూరం పెట్టే ప్రయత్నాలు జరుగుతుండడంతో.. మొదటికే మోసం వస్తుందని సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నారు.
వీపీఆర్కు చంద్రబాబు నెల్లూరు పార్లమెంట్ సీటును ఖరారు చేసినట్లే. నెల్లూరు సిటీకి మాజీ పొంగూరు నారాయణ, రూరల్కు కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, ఉదయగిరికి సురేష్, కావలికి కావ్య కృష్ణారెడ్డిని ఇప్పటికే బాబు ఓకే చేసేశారు. మిగిలిన స్థానాలపై దృష్టి సారించారు. వేమిరెడ్డి కోవూరు టికెట్ను తన భార్య ప్రశాంతిరెడ్డికి అడుగుతున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తనయుడు దినేష్రెడ్డి ఇన్చార్జిగా ఉన్నారు. తనకే అవకాశం ఇస్తారని పెద్ద మొత్తంలో ఖర్చు చేశారు. కానీ వీపీఆర్ రాకతో బాబు మనసు మారిపోయింది. ఆయన కోరిన విధంగా ప్రశాంతిరెడ్డికి సీటు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. దీంతో పోలంరెడ్డి, ఆయన వర్గం అధిష్టానంపై కోపంగా ఉన్నారు. పార్టీని నిలబెట్టేందుకు ఎంతో కష్టపడితే ప్రతిఫలం ఇదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
ఇక సర్వేపల్లి నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కానీ ఈయనకు టికెట్ ఇవ్వడం లోకేశ్కు ఇష్టం లేదు. వరుస ఓటములే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఒక దశలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, సీనియర్ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి పేర్లు కూడా వినిపించాయి. వీపీఆర్ను టీడీపీలోకి తీసుకొచ్చేందుకు కీలకపాత్ర పోషించాను కాబట్టి టికెట్ తనకే వస్తుందని సోమిరెడ్డి భావించారు. కానీ ఈ పొలిట్బ్యూరో సభ్యుడిని లెక్కలోకి కూడా తీసుకోవడం లేదు. ఎలాగూ ఇచ్చే ఆలోచన వారేకే లేనప్పుడు తనకెందుకని వేమిరెడ్డి కూడా తన బంధువైన సోమిరెడ్డి కోసం కాకుండా రూప్కుమార్ యాదవ్కు అవకాశం కల్పించాలని బాబును కోరినట్లు సమాచారం. దీంతో ఒక్కసారిగా సమీకరణాలు మారిపోయాయి. రూపు పేరుతో ఐవీఆర్ఎస్ సర్వే కూడా జరిగింది. అతని వైపే ప్రజలు మొగ్గు చూపారని వీపీఆర్ వర్గం సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది. ఇదంతా చూసి సోమిరెడ్డి మొదటికే మోసం వచ్చిందని తల పట్టుకున్నారు. ఇప్పటి వరకు ఎన్నో ఆశలతో డబ్బు ఖర్చు చేసిన ఆయన మనుషులకైతే నోటి వెంట మాట కరువైంది. ఇక పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి బాధ వర్ణనాతీతం. ప్రతిసారి ఆశపెట్టి తనను మోసం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆనం రామనారాయణరెడ్డి గతంలో ఆత్మకూరు నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆయన అక్కడికి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. సర్వేపల్లి నుంచి పోటీ చేయాలని అనుకోవడం లేదు. నెల్లూరు జిల్లా పరిధిలో నారాయణ తదితరుల పెత్తనం ఎక్కువ ఉంటుందని.. పార్టీలోనూ వారికే ప్రాధాన్యం ఇస్తారని.. వెంకటగిరి సీటు అడుగుతున్నారు. కానీ మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తన టికెట్ను త్యాగం చేసే పరిస్థితి లేదు. దీంతో వేమిరెడ్డి రంగంలోకి దిగి ఆనం ఆత్మకూరు నుంచే పోటీ చేసేలా ఒత్తిడి తెచ్చి ఒప్పించినట్లు తెలిసింది. ఎన్నికలు సమీపిస్తున్నా అభ్యర్థుల విషయంలో పూర్తి స్పష్టత లేకపోవడవంతో తెలుగు తమ్ముళ్లు నైరాశ్యంలో మునిగిపోయారు.