అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాముల పట్ల ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తుందని టీడీపీ ఎమ్మల్యే అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యలు చేసారు. ఈ మేరకు ఆయన ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేసారు. ప్రభుత్వం స్వాములను పట్టించుకోలేదని, దీక్షా విరమణ సమయానికై ప్రత్యేక బస్సులు కూడా నడపడం లేదని, దానివల్ల శబరిమల వెళ్ళే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల స్వామి దర్శనం లేక భక్తులు, మాలధారులు తీవ్ర నిరాశతో ఉన్నారని తెలిపారు.
అయితే, కార్తీక మాసం ప్రారంభమయిన నాటి నుంచే ఏపీయస్ ఆర్టీసీ అన్ని జిల్లాల నుంచి శబరిమలకు ప్రత్యేక బస్సులు నడుపుతుంది. ఈ విషయమై పత్రికల్లో వార్తలు, బస్టాండ్ పరిసరాల్లో బేనర్లు అన్ని జిల్లాలలో ఏర్పాటు చేసారు కూడా. నలభై, ముప్పయి సీట్లతో నడిచే ఈ ప్రత్యేక బస్సులు నడుస్తున్నాయి. ప్రస్తుతం యాత్ర ముగింపు రోజులు కాబట్టి భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులు అన్నీ దాదాపు తిరుగు ప్రయాణంలో ఉన్నాయి .
మకర సంక్రాంతికి జ్యోతి దర్శనం తర్వాత శబరిమల వెళ్లే భక్తులు బహు అరుదు.
కేరళ నుంచి ఆంధ్ర వరకూ జిల్లాల వారీగా దారిలో ఎదురయే ప్రధాన పుణ్యక్షేత్రాల దర్శనాలను కూడా ఆర్టీసీ ప్యాకేజిలలో పొందుపరిచారు. జ్యోతి దర్శనం చేసుకొన్న భక్తులతో రాబోయే రెండు మూడు రోజులలో తిరిగి వచ్చేవే చివరి సర్వీసులు . ఇవన్నీ తెలియకుండా, తెలిసినా పట్టించుకోకుండా యాత్ర ముగింపు సమయంలో టీడీపీ ఎమ్మెల్యే చేసిన ఈ ప్రకటన సత్యదూరం.
ఇదిలా ఉంటే, ఈ సంవత్సరం శబరిమలలో రికార్డు స్థాయిలో దర్శనాలు అయ్యాయి, తొక్కిసలాటలు జరిగాయి, ఆంధ్రాకి చెందిన గురుస్వాములు మాల వేసుకోని సాధారణ భక్తులను కొన్ని రోజులు దర్శనానికి రావద్దని కూడా అభ్యర్థించడం అన్ని మీడియాల్లోనూ వచ్చింది కూడా. మరి ఆంధ్ర నుండి ఇంత మంది భక్తులు ఆర్టీసీ కాకుండా కేవలం ప్రైవేటు వాహనాల్లోనూ, అరకొర రైలు సాధనాల్లో మాత్రమే ప్రయాణించారో ఏమో మరి ఈ ఎమ్మెల్యే గారికే తెలియాలి.