భారతీయ జనతా పార్టీ తమను ఎన్డీఏ కూటమిలోకి తీసుకుందని తెలుగుదేశం శ్రేణులు తెగ ఆనందించారు. గెలిచేస్తున్నాం.. ప్రధాని నరేంద్రమోదీ అండతో చంద్రబాబు నాయుడు సీఎం అయిపోతున్నారని డ్యాన్స్లు చేశారు. ఊహా లోకంలో తేలుతున్న వారికి ఇప్పుడు కొత్త భయం పట్టుకుంది. కమలం పార్టీతో పొత్తేS తమను ముంచేస్తుందా అని ఆందోళన చెందుతున్నారు.
సుమారు నెలరోజుల తర్వాత బీజేపీతో టీడీపీ పొత్తు ఓకే అయ్యింది. దీనికోసం చంద్రబాబు తనకంటే జూనియర్లయిన కాషాయ పార్టీ నేతల్ని బతిమిలాడుకోవాల్సి వచ్చింది. పొత్తును చారిత్రక అవసరంగా నారా వారు చూపించారు. ముస్లిం, మైనార్టీలకు అండగా ఉంటామని, వారికేమీ కాకుండా చూసుకుంటామన్నారు. కానీ పరిస్థితులు తలకిందులయ్యాయి.
బీజేపీకి కేంద్రంలో అధికారమే ముఖ్యం. ఇందులో భాగంగా ఎన్నికలకు ముందు అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఒకటి సీఏఏ. పౌరసత్వ సవరణ చట్టం – 2019ని అమల్లోకి తీసుకొస్తూ మోదీ సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైపోయింది. ఈ విషయాన్ని ఎలా డీల్ చేయాలో అర్థంగాక చంద్రబాబు తల పట్టుకుని కూర్చొంటే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా మరో బాంబు పేల్చారు. హైదరాబాద్ పర్యటనలో తాము అధికారంలోకి వస్తే మైనార్టీలకు ఉన్న నాలుగు శాతం రిజర్వేషన్లు తొలగిస్తామని ప్రకటించారు. బీజేపీ తీరుతో రాష్ట్రంలోని ముస్లింలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
మణిపూర్లో జరిగిన ఘటనలతో దేశ వ్యాప్తంగా మైనార్టీలు ఆందోళన ఉన్నారు. సీఏఏ అమల్లోకి రావడంతో అది మరింత పెరిగింది. ఇప్పుడు ముస్లింల రిజర్వేషన్లు తీసేస్తామని చెప్పారు. తమకు ఈ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అండగా ఉంటారని చంద్రబాబు భావించారు. కానీ కమలం పెద్దల తీరుతో ఇప్పుడు ఆ ఆశలు లేవు. ఏపీలో వారి ఓట్లే చాలా కీలకం. దీంతో పొత్తు ఎందుకు పెట్టుకున్నామా? అని బాబు అనుకుంటున్నారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. టీడీపీ ఎన్డీఏలో చేరాక ముస్లింలు ఆ పార్టీని వీడుతున్నారు. తమకు వ్యతిరేకంగా వ్యవహరించే పార్టీలకు ఓట్లు వేసేది లేదని కుండబద్ధలు కొడుతున్నారు.
ఈ పరిణామాలతో తెలుగు తమ్ముళ్లు నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. బాబు తన నెత్తిన తానే చెత్త వేసుకున్నారని అభిప్రాయపడుతున్నారు. ముస్లిం, మైనార్టీల ఓట్లు టీడీపీ, జనసేనకు ఏ మాత్రం పడవని భయాందోళనకు గురవుతున్నారు. పొత్తు బూమరాంగ్ అయ్యే పరిస్థితులే అధికంగా ఉన్నాయి.