2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ – జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించారు. జనసేన 2024 ఎన్నికల్లో 24 అసెంబ్లీ , 3 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేయనున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించారు. గతంలో పది సీట్లకో, పదిహేను సీట్లకో తన ఆత్మ గౌరవం తాకట్టు పెట్టలేనని చెప్పిన పవన్ కళ్యాణ్, నేడు కేవలం 24 సీట్లలో ఎలా పోటీ చేస్తున్నాడు? పవన్ కళ్యాణ్ కు ఆత్మ గౌరవం లేదా అనే సందేహాలు సామాన్యుల్లో కూడా తలెత్తుతున్నాయి.
జనసేన పోటీ చేస్తున్న 24 సీట్లలో 5 మంది అభ్యర్థులను ప్రకటించి, కనీసం తాను ఎక్కడ పోటీ చేస్తున్నాడో ప్రకటించుకొలేని పరిస్థితిలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. 175 నియోజకవర్గాలున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 10 శాతం సీట్లలో పోటీ చేయడానికి ఒప్పుకుని తన అభిమానులను టీడీపీకి తాకట్టు పెట్టడానికి సిద్దమయ్యాడు. పూటకో లెటర్ ప్యాడ్ మీద ప్రకటనల చేసే జనసేన పార్టీ, పార్టీకి అత్యంత కీలకమైన అభ్యర్థుల ప్రకటన చేసేటప్పుడు మాత్రం చిత్తు కాగితంపైన రాసి మీడియా ముందుకు చూపించాడు. దీన్నిబట్టి అర్ధమయ్యేదేమంటే ఆ సీట్లు కూడా చంద్రబాబు చెప్తే అప్పటికప్పుడు పేపర్ మీద రాసి ప్రకటన చేశాడు.
ఓ పక్క టీడీపీ అధినేత చంద్రబాబు తాను ఎంపిక చేసిన అభ్యర్థుల లిస్టును మొత్తం చదివి వినిపిస్తే మరోపక్క పవన్ కళ్యాణ్ కేవలం ఐదు నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటించి మిగిలిన 19 నియోజక వర్గాల ఊసే ఎత్తలేదు. ఒకవేళ ఆ 19 మంది అభ్యర్థులను ప్రకటిస్తే ఆ అభ్యర్థుల జాబితాలో కూడా టీడీపీ వాళ్ళు ఎంత మంది ఉంటారో అనే అనుమానం జన సైనికుల్లో వ్యక్తమవుతోంది. కొండంత రాగం తీసి పిసరంత పాట పాడినట్లుగా ఈ మాత్రం దానికి పార్టీ పెట్టడం దేనికి? టీడీపీ పల్లకీ మోస్తూ కూడా ఆత్మ గౌరవం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం దేనికంటూ జనసేన కార్యకర్తలు ఆవేదనతో రగిలిపోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మొత్తం సీట్లలో కనీసం పావలా వంతు సీట్లు కూడా పొత్తులో తెచ్చుకోలేని పవన్ కళ్యాణ్ తాను పావలా వంతు కూడా సరితూగనని మరోసారి నిరూపించుకున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.