ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గం టికెట్ విషయంలో రేగిన మంటలు ఇప్పట్లో చల్లారే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ జయచంద్రారెడ్డి అనే వ్యక్తికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సీటు ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ అనుచరులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తాజాగా• టి.సదుంలో విజయ సంకల్ప యాత్రకు వెళ్లిన జయచంద్రారెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది. శంకర్ మనుషులే చేసి ఉంటారని అభ్యర్థి భావిస్తున్నారు. కాగా వాళ్లే రాళ్లు వేసుకుని తమపై ఆరోపణలు చేస్తున్నారని శంకర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో కార్యక్రమం వాయిదా పడింది. ఇక్కడ పార్టీ రెండుగా చీలిపోయింది.
టికెట్ తమ నేతకు ఇవ్వలేదని శంకర్ అనుయాయులు కొద్దిరోజుల క్రితం ఏకంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. ఒకతను పెట్రోలు పోసుకునేందుకు యత్నించి ఆత్మహత్యకైనా సిద్ధమని ప్రకటించాడు. నాయకులు అడ్డుకున్నారు. బాబు వచ్చి సర్దిచెప్పకుండా వారిపైనే కోప్పడ్డారు. ఎవరికి సీట్ ఇవ్వాలో నా ఇష్టమని, డిక్టేట్ చేయొద్దని ఆరోజు హెచ్చరించి వెళ్లిపోయారు. రెండు వర్గాల నడుమ వివాదం రోజురోజుకు ముదురుతోంది. అయినా అధిష్టానం నిమ్మకు నీరెత్తినట్లు ఉంది. ఇలాంటి తలనొప్పులు వస్తున్నాయనే బాబు రెండో జాబితా ప్రకటించేందుకు భయపడుతున్నారని సమాచారం. మరి ఈ పంచాయితీని తేలుస్తారా.. అలా వదిలేస్తారా అనే చర్చ నేతల్లో నడుస్తోంది.