టీడీపీ, జనసేన పొత్తులో మొదటి నుంచి తెలుగు తమ్ముళ్లు.. జనసైనికులపై పెత్తనం చేస్తూనే ఉన్నారు. సభల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు దెబ్బలు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా తమ నాయకుడికి టికెట్ వచ్చిన నేపథ్యంలో టీడీపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సేన నుంచి సీటు ఆశించిన మహిళా నేత ఇంటి ముందు బాణసంచా కాల్చి పైశాచిక ఆనందం పొందారు. దీంతో సదరు నాయకురాలు బాధ వర్ణనాతీతంగా ఉంది.
శ్రీకాళహస్తి టికెట్ కోసం టీడీపీ నుంచి బొజ్జల సుధీర్రెడ్డి, జనసేన నుంచి వినూత కోట, బీజేపీ నుంచి కోలా ఆనంద్ తీవ్రంగా ప్రయత్నించారు. చివరికి చంద్రబాబు నాయుడు మాజీ ఎమ్మెల్యే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి కుమారుడైన సుధీర్రెడ్డికి ఓకే చేశారు. రెండో జాబితాలో పేరు కూడా వచ్చింది. దీంతో కాళహస్తిలో బీజేపీ, జనసేన వర్గాలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నాయి.
ఆనంద్ గతంలో శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్గా పనిచేశారు. చాలాకాలంగా బీజేపీలో ఉన్నారు. 24లో ఎలా అయినా పోటీ చేయాలని చూస్తున్నారు. కమలం పెద్దలతో సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. దీంతో పొత్తు కుదిరినా తనవైపే మొగ్గు చూపుతారని అనుకున్నారు. ఇకపోతే జనసేన ఇన్చార్జి వినూత కూడా పొత్తులో భాగంగా టికెట్ తనకేనని భావించారు. పవన్ పర్యటనలకు చాలా మొత్తంలో ఖర్చు కూడా చేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వీరిద్దరికీ చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. తిరుపతి సీటు వదులుకున్న నేపథ్యంలో కాళహస్తిని గట్టిగా పట్టుకున్నారు.
ఈ ప్రాంతంలో టీడీపీ, జనసేన మధ్య చాలా కాలంగా పొసగడం లేదు. టికెట్ విషయంలో రచ్చ కూడా జరిగింది. సుధీర్రెడ్డికి ఓకే కాగా ఆయన అనుచరులు రెచ్చిపోయారు. వినూత ఇంటి ముందు బాణసంచా కాల్చారు. అంతటితో ఆగకుండా పార్టీలో కార్యాలయంలో ఉన్న మహిళలు, జనసైనికులపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో వినూత వర్గం తమ ఆవేదనను వెలిబుచ్చింది. సీటు రాలేదని ఆమె దుఃఖంలో ఉంటే తెలుగు తమ్ముళ్లు రాక్షసానందం పొందుతున్నారని బాధపడ్డారు. ఈ విషయాన్ని పవన్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం ఉండదని భావిస్తున్నారు. ఆయన టికెట్ విషయంలోనే మహిళకు అన్యాయం చేశారని, ఇప్పుడు అవమానిస్తున్నారని చెబితే పట్టించుకోరని వాపోతున్నారు.
మహిళా లోకానికి అండగా ఉంటానని ప్రసంగాలు చేసే సేనాని తన పార్టీ నాయకురాలి విషయంలో టీడీపీ నేతలు వ్యవహరించిన తీరును ఖండిస్తారో లేక లైట్ తీసుకుంటారో..