రాప్తాడులో సిద్దమంటూ గర్జించిన జగన్
రాప్తాడులో జరిగిన వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావసభ సిద్ధంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్ గర్జించారు. రాయలసీమ జిల్లాల్లోని 52 నియోజకవర్గాల నుంచి వెల్లువలా తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులకు సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు.
ఈ రోజు రాయలసీమలో సముద్రం కనిపిస్తోంది. జనసముద్రం మధ్యలో జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే… ఈ రోజు రాప్తాడుకు జనసముద్రం వచ్చింది. ఈ జన సముద్రానికి రాయలసీమగడ్డకు, ఇక్కడున్న ప్రతీ రాయలసీమ బిడ్డకు మీ జగన్ నిండుమనస్సుతో, గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. 2024 ఎన్నికల్లో జరగబోతున్న ఈ యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరగబోతుంది. ఇది కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఇప్పటివరకు ఈ 5 ఏళ్ల కాలంలో ఇంటింటికీ మనందరి ప్రభుత్వం అందించిన సంక్షేమం, అభివృద్ధి కొనసాగాలనే అడుగులు వేసే మనకు, ఈ పథకాలన్నీ రద్దు చేయడమే టార్గెట్గా పెట్టుకుని డ్రామాలు ఆడుతున్న చంద్రబాబుకు మధ్య జరిగే ఈ యుద్ధంలో మీరు సిద్ధమేనా? ఈ యుద్ధంలో పేదలు ఒకవైపున ఉంటే, పెత్తందారులకు మరోవైపునకు ఉంటే ఇద్దరికీ యుద్ధం జరగబోతుంది. ఈ యుద్ధం విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగపోతుంది. ఈ యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కొరకు, పేదవాడి తరపున నిలబడడానికి మీరంతా సిద్ధమేనా?
చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. ఆయన పేరు చెబితే రైతులకు, అక్కచెల్లెమ్మలకు, బడికి వెళ్లే పిల్లలకు, కాలేజీకి వెళ్లే పిల్లలకు, అవ్వాతాతలకైనా గుర్తుకు వచ్చే ఒక్కటంటే ఒక్క పథకమైనా ఉందా? అని అడుగుతున్నాను. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికీ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని, ఫలానా మంచి పథకం తీసుకువచ్చాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం గుర్తుకురాదు. చంద్రబాబు ప్రజల ఆరోగ్యం కోసం మీరు చేసిన మంచి పని ఏదైనా ఉందా? వాళ్ల ఆరోగ్యం కోసం తెచ్చిన ఒక్క మంచి స్కీం అయినా ఉందా? అని అడుగుతున్నాను. బాబు పేరు చెబితే.. రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికైనా వెళ్లి, ఆ గ్రామం మధ్యలో నిలబడి మీరు ఏర్పాటు చేసిన పరిపాలనావ్యవస్ధ కనీసం ఒక్కటంటే ఒక్కడైనా కనిపిస్తుందా? ఆ గ్రామంలో బాబు హయాంలో బాగుబడిన స్కూళ్లు, ఆసుపత్రులు ఉన్నాయా? బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? ప్రతి సామాజికవర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులగా రాయడం ఆ తర్వాత ఆ సామాజిక వర్గాన్ని మోసం చేయడం చంద్రబాబునాయుడు ఆనవాయితీగా పెట్టుకున్నాడు.
సీఎం అయిన మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోలో కనీసం 10శాతమైనా అమలు చేశారా? గతం ప్రజలకు నమ్మకం ఉండదన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్దాలు, అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకుని బంగారు కడియం ఇస్తానని ఊబిలోకి దింపి మనుషుల్ని తినేసే పులి మాదిరిగా చంద్రబాబునాయుడు ఎర చూపిస్తున్నాడు. నమ్మినవాడు మునుగుతాడు. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబుగారి సిద్ధాంతం. మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన బాబు, మూడుసార్లు మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు. ఎన్నికలకు మందు ఫలాన పనులు చేస్తానని రంగు,రంగు కాగితాలతో ఆశపెట్టాడు. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ తాను చేసిన మోసం, ఆ దగా కళ్లెదుటే కనిపిస్తుంది. కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని, ఏనాడూ అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికీ వెళ్లి ఇక్కడున్న ప్రతి కార్యకర్తా ఇంటింటికీ వెళ్తి చెప్పాలి.
ఈ 57 నెలల్లో ఇంతకముందు కనీవినీ ఎరుగని విధంగా విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చాం. ఈ విప్లవాత్మక అడుగులు ఇంకా కొనసాగాల్సిన విషయం ఎంత ముఖ్యమో, అవసరమో ప్రతి ఇంట్లో ఉన్న అక్కకూ,చెల్లెమ్మకు, అన్నాతమ్ముళ్లకు, అవ్వాతాతలకు చెప్పాలి. మన వైఎస్సార్సీపీకి ప్రజలు 2019లో ఒక్కసారి అధికారమిస్తేనే రైతులకు అదనంగా ఇంతకముందు రైతన్నలు ఎప్పుడూ చూడని విధంగా, రైతు భరోసాను తీసుకువచ్చి ఇచ్చాం. గ్రామాలలో రైతులను చేయిపట్టుకుని నడిపించే రైతుభరోసా కేంద్రాలను గ్రామస్ధాయిలోకి తీసుకువచ్చి ఇచ్చాం. పగటిపూటే రైతన్నలకు తొమ్మదిగంటలపాటు ఉచిత విద్యుత్, ఆ రైతన్నకు తన గ్రామంలోనే అందుబాటులోకి తీసుకునివచ్చాం. మొట్టమొదటిసారిగా ఏ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం మొదలుపెట్టింది కూడా మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. రైతన్నకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగనివిధంగా ఉచితంగా పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఇచ్చాం. రైతులకు తోడుగా ఉంటూ ఆదుకునే కార్యక్రమాలు మీ బిడ్డ పాలనలోనే జరిగాయి. ఈ పథకాలన్నీ ప్రతి రైతన్నకు కొనసాగాలన్నా, రైతులను పీడించే బాబు మార్క్ దళారీ వ్యవస్ధ మళ్లీ రాకూడదన్నా, అందుకోసం ప్రతి ఒక్క రైతన్న బయటకు రావాలి. స్టార్ క్యాంపెయినర్లుగా ఆ రైతన్న ముందుకువచ్చి ఇంకో వందమందికి చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో చంద్రబాబు తాను బేషరతుగా చేస్తానన్న రూ.87,612 కోట్ల రుణమాఫీని ఓ మోసంలో ఎలా మార్చాడో ప్రతి రైతన్నకు గుర్తు చేయాల్సిన అవసరం మనలో ఉన్న ప్రతి కార్యకర్తకూ ఉంది.
2019లో సీఎం అయిన మీ జగన్ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గతంలో ఎప్పుడూ జరగని విధంగా అమ్మఒడి, ఆసరా, సున్నావడ్డీ, చేయూత, కాపునేస్తం, ఈబీసీ నేస్తం, 31లక్షల ఇళ్లపట్టాల పంపిణీ,వేగంగా నిర్మాణం జరుపుకుంటున్న 22 లక్షల ఇళ్లు, ప్రతి అక్క చెల్లెమ్మ ఫోన్లోనూ దిశ యాప్, వారికి తోడుగా ఉండేందుకు అదే గ్రామంలోనే ఒక మహిళా పోలీసు ఇవన్నీ మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే అడుగులు పడ్డాయి. మహిళా సాధికారతకు ఇంతగా పాటుపడుతున్న జగనన్న ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని, ఫ్యాను గుర్తు మీద ఓటు వేయాలని,ప్రతి అక్కచెల్లెమ్మ వెళ్లి.. స్టార్ క్యాంపెయినర్గా మరో వందమందికి చెప్పి ఓటు వేయించాల్సిన బాధ్యత ఉంది.
ఫ్యాన్ ఇంట్లో సైకిల్ బయట తాగేసిన గ్లాసు సింక్లో ఉండాలి
ఇవాళ బిర్యానీ పెడతానని, విందు భోజనం పెడతానని మోసపూరిత ఆశచూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని రెండింటినీ కూడా రైతన్న దగ్గరనుంచి లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. ప్రభుత్వ పథకాలను అందుకున్న ప్రతి ఒక్క కుటుంబం మనకు ఒక స్టార్ క్యాంపెయినర్గా వారందరూ ఇంటిలోనుంచి బయటకు రావాల్సిన అవసరం ఉంది. మనం చేసినవి చెప్పాలి. వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటిలో చెప్పాలి. ఫ్యాను ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి. సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరికీ అర్ధం అయ్యేలా చెప్పండి.
విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు
మన పార్టీ పేరు చెబితే ప్రభుత్వ బడులకు వెళ్లే పిల్లలకు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఇంగ్లిషు మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, నాడునేడుతో బాగుపడుతున్న స్కూళ్లు. మొట్టమొదటిసారిగా వాళ్ల పుస్తకాలకు బైజూస్ కంటెంట్తో అనుసంధానం, తొలిసారిగా ఒక పేజీ ఇంగ్లిషు, ఒక పేజీ తెలుగుతో బైలింగువల్ టెక్ట్స్బుక్స్, తొలిసారిగా వాళ్ల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. తొలిసారిగా ప్రతి స్కూల్లోను 6వతరగతి నుంచి ఆ పైబడిన ప్రతి క్లాస్రూంలోనూ ఐఎఫ్పి ఫ్యానెల్స్తో డిజిటల్ బోధనతో కనిపిస్తున్నాయి. తొలిసారి సబ్జెక్ట్ టీచర్ కాన్సెఫ్ట్ను ప్రవేశపెట్టాం. మొట్టమొదటిసారిగా క్లాస్రూంలలో టోఫెల్ సైతం బోధన చేయడం జరుగుతోంది. సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం సాగుతోంది. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు ఏ క్వార్టర్లో ఉన్న ఫీజులు ఆ క్వార్టర్ అయిపోయిన వెంటనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లోకి పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తూ విద్యా దీవెన, వసతి దీవెనను, జాబ్ ఓరియెంటెడ్గా కరిక్యులమ్లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం చేస్తున్నాం. ఇవన్నీ కొనసాగాలంటే ఆ పిల్లల తల్లుదండ్రులు స్టార్ క్యాంపెయినర్లుగా మారి మరో వంద మందికి చెప్పి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని చెప్పండి.
2019లో మనం అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలోని ఏ గ్రామమైనా ఆ గ్రామానికి వెళ్లి అక్కడ నిల్చుంటే ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. అందులో 10 మంది శాశ్వత ఉద్యోగాలు చేస్తున్న మన పిల్లలు కనిపిస్తారు. అదే గ్రామంలో నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, మరో నాలుగడుగులు వేస్తే కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడునేడుతో రూపు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. వీటన్నింటితో పాటు ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే ఓ మంచి వాలంటీర్ వ్యవస్థ ఒక్క రూపాయి కూడా లంచం అడగకుండా వివక్ష చూపకుండా మంచి చేస్తున్న వ్యవస్థ కనిపిస్తుంది. ఈ రోజు ఒక్క రూపాయి లంచం లేకుండా, వివక్ష లేకుండా, లంచం లేకుండా నా అక్కచెల్లెమ్మల కుటుంబాలకు, మీ బిడ్డ, మీ అన్న అక్షరాలా 125 సార్లు బటన్ నొక్కాడు. ఏకంగా రూ. 2.55 లక్షల కోట్లు పంపిన మాట వాస్తవం కాదా అని ప్రతి అక్కను, చెల్లెమ్మను అడగండి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు
నిరుద్యోగులకు ఈ 57 నెలల్లో.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు మన రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగాలుంటే ఈ 57 నెలల మీ బిడ్డ పాలనలోనే ఏకంగా 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాడని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకు వచ్చాయి. ఒకటి, రెండు కాదు దాదాపు 35 లక్షల ఎకరాల మీద సర్వ హక్కులు అనుభవదారులకు, గిరిజనులకు, రైతన్నలకు, నిరుపేదలకు ఇచ్చినది ఎవరంటే మీ జగన్. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఎన్నికైన పదవుల నుంచి మంత్రిమండలి వరకు, డిప్యూటీ సీఎంలు, రాజ్యసభ, శాసనసభాపతి వరకు, మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు ఇచ్చింది ఎవరంటే మీ జగన్. ప్రజా ప్రతినిధులైన వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు జెడ్పీ ఛైర్మన్లకు, కార్పొరేటర్లకు, మేయర్లకు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న డైరెక్టర్లకు, చైర్మన్లకు, ఇతర ప్రజా ప్రతినిధులకు మీ అందరికీ ఇక్కడే ఒక్క విషయం చెబుతున్నాను. ఇది మీ అందరి పార్టీ. కార్యకర్తల్ని, నాయకుల్ని, అభిమానించే విషయంలో, రాష్ట్ర చరిత్రలో ఏపార్టీ చేయని విధంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది. మార్కెట్ యార్డులు, దేవాదయ బోర్డులు, నామినేటెడ్ పోస్టుల భర్తీలో, 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి పదవులివ్వడం కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యం.
ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా ఉండదు. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అని, మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా, మీరే సైనికులుగా నిలబడండి అని ప్రతి ఇంటికీ వెళ్లి నిబద్ధతతో చెప్పి.. ఎన్నికలకు సిద్ధం అంటుంటే, మరోవంక బాబు పేదల ఇంటికిగానీ, పేదల సామాజికవర్గాలకు గానీ, గ్రామాలకుగానీ, రాష్ట్రానికి గానీ ఏం చేశాడో చెప్పుకొనేందుకు ఒక్కటంటే ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడు.అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు తానూ పోస్టర్లు వేయిస్తాడు. సంసిద్ధం, మేమూ సిద్ధం అని వేయిస్తాడు.
ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు, అర్జునుడు.
దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి, తలవంచడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ఉన్న ఇంత మంది.. ఇన్ని లక్షల గుండెలు, కోట్ల గుండెలు. ప్రతి పేదవాడి ఇంట్లో ఈ బిడ్డ మా బిడ్డ అంటూ తోడుగా ఉండే గుండెలు. ప్రజలే అండగా ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతున్నా. మీరంతా సిద్ధమేనా? ప్రతి కార్యకర్తకూ మీ అన్న మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని తెలియజేస్తున్నాను. ప్రతి కార్యకర్తకూ, ప్రజా సేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు అవకాశం కల్పించే బాధ్యత నాదీ అని గర్వంగా చెబుతున్నాను.
ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ ప్రతి పేద కుటుంబానికీ మంచి చేశాం. ప్రతి పేదకు, వారి భవిష్యత్కు అండగా నిలబడగలిగాం. మాట ఇచ్చాం. మాట నెరవేర్చాం. మళ్లీ ప్రజల దగ్గరికి వెళ్లగలిగే పరిస్థితి మనకు, మన వైయస్సార్సీపీకి ఉంది.
అందుకే వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్… 175కు 175 అని అడుగుతున్నాను. మన టార్గెట్ 25కు 25 ఎంపీలు అని అడుగుతున్నాను.
పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలే లేదు.
పేదవాడి భవిష్యత్ కోసం యుద్ధానికి మీరంతా సిద్ధమేనా అని అడుగుతున్నాను. మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజుల్లో జరగబోయే కురుక్షేత్రానికి… ఒక సైన్యంగా పని చేయడానికి, చంద్రబాబు ప్రచారాలు, ఈనాడు రాతలు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథలు, వారి అబద్ధాలు, మోసాలు.. వీటన్నింటిని నుంచి ఇంటింటి అభివృద్ధి, పేదవాడి భవిష్యత్ను కాపాడేందుకు మీరంతా సిద్ధమేనా? వారి మీడియా, వారి సోషల్ మీడియాలో వారు చేసే దుష్ప్రచారాలను తిప్పి కొట్టాలి. దానికి మీరంతా సిద్ధమేనా? వారి చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సిద్ధమేనా? మీ అందరికీ సెల్ఫోన్లు ఉన్నాయా? ఆ సెల్ఫోన్లు ఒక్కసారి బయటకు తీయండి. అందులో లైట్ బటన్ నొక్కండి. సెల్ టార్చర్ ఆన్ చేసి ప్రతి ఒక్కరూ కూడా.. సిద్ధమే అని చెప్పండి.
పెత్తందార్లు,తోడేళ్ల మాదిరిగా ఏకం అవుతున్నారు.
ఈ ఎన్నికలు చాలా కీలకం. అందుకే పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. తోడేళ్లు మాదిరిగా ఏకం అవుతున్నారు. మనం యుద్ధం చేస్తున్నది చంద్రబాబుతో మాత్రమే కాదు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు దత్తపుత్రుడితో యుద్ధం చేస్తున్నాం. ఇంత మంది ఏకం అవుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంత మంది సరిపోరు అని జాతీయ పార్టీలతో కూడా పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తు తెచ్చుకొనేందుకు వెంపర్లాడుతున్నాడు. కేవలం ఒకే ఒక్కడి మీద యుద్ధం చేయడానికి ఇంత మంది తోడేళ్లు ఏకం అవుతున్నారు. అందుకే ఈ ఎన్నికలు చాలా కీలకం. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒకడికే సాధ్యం కాదు. మీ జగన్కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో ఉన్న అక్కచెల్లెమ్మ, అవ్వాతాత, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న కూడా మీ జగన్కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
పేదవాడి భవిష్యత్తును నిర్ణయించే ఓటు
ఈ ఎన్నికలు ఆశామాషీ ఎన్నికలు కాదు. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు రేప్పొద్దున పేదవాడి భవిష్యత్ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. పేదవాడి భవిష్యత్ మారాలంటే, పేదవాడి పిల్లాడు రేప్పొద్దున 10–15 సంవత్సరాలకు అనర్గళంగా ఇంగ్లీషులో మాట్లాడుతూ, పెత్తందార్లతో పోటీ పడుతూ పెద్ద కంపెనీలతో ఉద్యోగాలు సంపాదించుకోవాలంటే జరగబోయేఎన్నికలు అత్యంత కీలకం. పేదవాడి ప్రతి గుండె ఏకం కావాలి. పెత్తందార్ల పార్టీలను పూర్తిగా నాశనం చేసే పరిస్థితి రావాలి. అందుకే ఈ ఎన్నికలు అత్యంత కీలకమైనవి. దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వానికి కలకాలం ఉండాలని, మరో అవకాశం మనందరి ప్రభుత్వానికి నిండు మనసుతో దేవుడు ఆశీర్వదించి ఇవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సీఎం వైయస్ జగన్ తన ప్రసంగం ముగించారు.