2019 నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పారిశ్రామిక రంగ అభివృద్ధికి వేగంగా చర్యలు తీసుకుంది. ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 125కు పైగా భారీ పరిశ్రమలు వచ్చాయి. 85,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు పొందారు. ఇంకా ఎస్ఈజెడ్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
విశాఖ – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణంలో భాగంగా గుర్తించిన స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో నక్కపల్లి క్లస్టర్లో ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటుకు బీజం పడింది. నక్కపల్లి మండలంలో ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో పరిశ్రమల స్థాపన కోసం అవసరమైన సదుపాయాల కల్పనకు ఇటీవల పచ్చ జెండా ఊపింది.
ఎస్ఈజెడ్ కోసం స్టార్టప్ ఏరియా కింద 1,120 ఎకరాలు సిద్ధం చేసినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీంతో మౌలిక సదుపాయాల కోసం రూ.399 కోట్లు విడుదల చేసింది. ఈ పనులకు ఇటీవల పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ వర్చువల్గా శంకుస్థాపన చేశారు. త్వరలోనే అభివృద్ధి పనులు ప్రారంభం కానున్నాయి.
రైతుల నుంచి సేకరించిన సుమారు నాలుగువేల ఎకరాల భూముల్లో ఎస్ఈజెడ్ ఏర్పాటుకు జగన్ సర్కారు నిర్ణయించింది. ఇక్కడ పరిశ్రమలు స్థాపించేందుకు పలువురు పారిశ్రామికవేత్తలు ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎస్ఈజెడ్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తే పరిశ్రమలు స్థాపించే అవకాశం బాగుందని భావించిన ప్రభుత్వం తొలుత 1,120 ఎకరాలను స్టార్టప్ ఏరియా కింద గుర్తించింది. ఇక్కడ ముందుగా రోడ్లు, డ్రెయినేజీలు, తాగునీరు, వాడుకనీరు, విద్యుత్ సదుపాయాలు కల్పిస్తారు. వీటి కోసం ప్రభుత్వం మొదటి విడతగా ఇటీవల నిధులు కేటాయించింది. అలాగే రోడ్డు కనెక్టవిటీ కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రధాన జాతీయ రహదారి నుంచి ఎస్ఈజెడ్ కోసం సేకరించిన భూముల వరకు రెండు లేదా నాలుగులేన్ల రోడ్లు నిర్మించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఏపీఐఐసీ సేకరించిన భూముల్లో స్టార్టప్ ఏరియాలో అమలాపురం శివారు మూలపర సమీపంలో సబ్స్టేషన్ నిర్మించాలని నిర్ణయించింది. రైతులకు చెల్లించాల్సిన పరిహారం విషయంలోనూ ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తోంది. విశాఖ జిల్లా అభివృద్ధి చేసి రూపురేఖలు మార్చాలని కృతనిశ్చయంతో ఉన్న జగన్ అధికారుల చేత వేగవంతంగా పనులు చేయిస్తున్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రి అయ్యాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఎస్ఈజెడ్ లకు శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత ఏపీలో అడుగులు వేస్తోంది జగన్ ప్రభుత్వమే..