ఇంద్ర సినిమాలో కొందరు వ్యక్తులు భక్తులకు మాయమాటలు చెప్పి బంగారు ఆభరణాలు దోచుకుంటారు. వాటిని నీకు.. నాకు.. నాకు.. నీకు.. అంటూ పంచుకుంటారు. ఏపీలో కొత్తగా వచ్చిన కూటమిని చూస్తే ఈ సీన్ గుర్తుకురాక మానదు.
ఎన్డీఏలో చేరేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు అది నెరవేరింది. ఇప్పుడు పొత్తులో భాగంగా సీట్ల లెక్క తేలాల్సి ఉంది. టీడీపీ తొలి జాబితా కింద 94 మంది అభ్యర్థుల్ని ప్రకటిచింది. జనసేనకు మొత్తం 24 అసెంబ్లీ, మూడు స్థానాలు ఇచ్చింది. మిగిలిన సీట్లను బీజేపీ కోసం ఆపి పెట్టారు. పవన్ మొత్తం ఆరు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. చాలా చోట్ల తెలుగు తమ్ముళ్లు, జనసైనికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇంకా ఆ మంటలు చల్లారలేదు. కొత్తగా బీజేపీ వచ్చి చేరింది. ఈసారి సీట్లు చెబితే ఇంకెన్ని చూడాలోనని ఓవైపు పెద్ద నేతలు భయపడుతున్నారు. ఇప్పుడు అసలు సినిమా మొదలైంది.
సీట్లపై చర్చించేందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడి నివాసానికి సోమవారం కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు జయంత్ పాండా చేరుకున్నారు. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి తదితరులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా పాల్గొంటారని తెలిసింది.
నెలరోజులకు పైగా బతిమిలాడుకుని బీజేపీని అటు చంద్రబాబు, ఇటు పవన్ ఒప్పించారు. దీంతో కమలం పెద్దలు చెప్పిన మాటను వాళ్లిద్దరూ వినాల్సిందే. అసెంబ్లీ సీట్లు తక్కువ ఇస్తానని బాబు చెప్పాడని ఎల్లో పత్రికలు రాశాయి. కానీ అది సాధ్యం అవుతుందా? లేదా? అని తేలాల్సి ఉంది. ఈ దఫా బాగా పుంజుకోవాలని బీజేపీ కూడా భావిస్తోంది. దీంతో స్థానాల సంఖ్య పెరిగే అవకాశముంది. ప్రధానంగా ఎంపీ సీట్లు వారు తీసుకోగా మిగిలినవి టీడీపీ, జనసేన అభ్యర్థులకు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని పార్టీల్లో అలకలు మొదలయ్యేందుకు అవకాశాలున్నాయి.
పవన్, కాషాయ పార్టీకి 30 శాసనసభ, 8 లోక్ సభ స్థానాలు కేటాయించారు బాబు. సేన 18 స్థానాలు ఎక్కడో తేలలేదు. అందులోనూ వారికి తక్కువగానే దక్కొచ్చు. ఇప్పటికే మూడు ఎంపీ సీట్లలో ఒకటి త్యాగం చేయాల్సిన పరిస్థితి ఉందని ప్రచారం ఉంది. చంద్రబాబు 57 అసెంబ్లీ సీట్లలో నుంచి మూడు, నాలుగు మాత్రమే కమలం నాయకులకు ఇచ్చి.. మిగతావి పవన్ దగ్గరున్న వాటి నుంచి సర్దే సూచనలు కనిపిస్తున్నాయి. 2014 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. టీడీపీ చాలా బలహీనంగా ఉంది. దీనిని కమలం పెద్ద అలుసుగా తీసుకోవచ్చు. చంద్రబాబు వెళ్లి ఆ పార్టీ పెద్దల నీడన చేరారు కాబట్టి జీ హుజూర్ అనాల్సిందే. అవసరమైతే 94 మందిలో కూడా మార్పులు చేయాల్సి వస్తుంది. పొత్తు వల్ల బాబుకు కొత్త తలనొప్పులు తప్ప ఒరిగేదేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.