ఏపీలో 2024 లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా రాజంపేట అసెంబ్లీ సీటును రాయచోటికి చెందిన సుగావాసి బాలసుబ్రమణ్యంకు టీడీపీఅధినేత చంద్రబాబు నాయుడు కేటాయించడంతో రాజంపేటలో మినీ కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది. రాజంపేట నియోజకవర్గంలో మొన్నటి వరకూ ఇంచార్జ్ గా వున్న బత్యాల చెంగలరాయుడు కు చంద్రబాబు మొండి చెయ్యి చూపించి పక్క నియోజకవర్గానికి చెందిన మాజీ జెడ్పీటీసీ సుగవాసి బాలసుబ్రమణ్యం కు టికెట్ ఇవ్వడంతో బత్యాల చెంగలరాయుడు వర్గం పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు.
ఇప్పటికే బత్యాల చెంగలరాయుడు వర్గానికి చెందిన కీలక నాయకులు టీడీపీకి రాజీనామా చేశారు. బత్యాల చెంగలరాయుడు కూడా చంద్రబాబు నాయుడు తనని నమ్మించి మోసం చేశాడని ఈ ఎన్నికల్లో తన బలం ఏమిటో చూపిస్తా అంటూ సవాల్ విసిరారు. ఇక టీడీపీ ముఖ్య కార్యకర్తలు ఏప్రిల్ 1 వ తేదీన రాజంపేటలో భారీ ర్యాలీ నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు రాజంపేట టికెట్ ను తనకే ఇవ్వాలని లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి తీరుతానని బత్యాల చెంగలరాయుడు చెబుతున్నారు.
ఇప్పుడు రాజంపేట టీడీపీ రెండుగా చీలిపోయి ఒక వర్గం సుగావాసి బాలసుబ్రమణ్యంకు రెండో వర్గం బత్యాల చెంగలరాయుడుకి సపోర్ట్ గా ఉంటున్నాయి. ఈ రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఈ గ్రూపు గొడవలతో రాజంపేట టీడీపీలో ఎప్పుడూ ఏమి జరుగుతుందో అని అందరూ భయంతో వున్నారు. బత్యాల చెంగలరాయుడు కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే మాత్రం రాజంపేట లో అలాగే రైల్వే కోడూరు లో టీడీపీ జనసేన కూటమికి కోలుకోలేని దెబ్బ తగులుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.