చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్న షర్మిల తాజాగా జగన్ ప్రభుత్వంలో దండగ అని, ఒక్క పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని సంచలన ఆరోపణలు చేసింది. షర్మిల చేస్తున్న ఆరోపణలన్నీ చంద్రబాబు కనుసైగల్లో నుండి వస్తున్నాయని రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది. షర్మిల చేసిన ఆరోపణలకు విరుద్ధంగా వాస్తవాలు ఉండటం గమనార్హం. షర్మిల ఎవరి స్క్రిప్ట్ అయితే చదువుతుందో ఆ చంద్రబాబే వ్యవసాయం దండగ అంటూ రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేసారు. ఒకసారి వాస్తవాలను పరిశీలిస్తే..
గత ఐదేళ్ళలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికాలేదని షర్మిల కోడై కూస్తుంటే మరోవైపు కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రోజుకు 8 టీఎంసీలు తరలించడానికి ఏపీ సీఎం జగన్ ప్రణాళిక వేశారు అని చెబుతున్నారు. జగన్ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించాక వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసారు. త్వరలోనే ఆ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. నెల్లూరు సంగం బ్యారేజ్ పూర్తి అయింది. గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు వద్ద రెండో టన్నెల్ను ప్రభుత్వం పూర్తి చేసింది. పులిచింతల ప్రాజెక్టులో 2019 ఆగస్టులో తొలిసారిగా 45.77 టీఎంసీల నీటిని నిల్వచేశారు. రూ.500 కోట్లతో తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్ లైనింగ్ పూర్తిచేశారు.
కృష్ణా డెల్టా వరదాయిని పులిచింతల ప్రాజెక్టును దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. గత సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల 2019 వరకూ పూర్తి స్థాయిలో 45.77 టీఎంసీలను నిల్వ చేయలేని దుస్థితి నెలకొంది. నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించిన సీఎం జగన్ 2019 ఆగస్టులోనే పులిచింతలలో 45.77 టీఎంసీలను నిల్వ చేసి కృష్ణా డెల్టాలో రెండో పంటకూ నీళ్లందించేందుకు మార్గం సుగమం చేశారు.
గత టీడీపీ సర్కారు నిర్వాసితులకు పునరావాసం కల్పించకపోవడం వల్ల గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, సోమశిల, కండలేరులో కూడా పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఏర్పడింది. సీఎం జగన్ గండికోట నిర్వాసితులకు రూ.వెయ్యి కోట్లతో, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్వాసితులకు రూ.250 కోట్లతో పునరావాసం కల్పించారు. దీంతో గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో పది టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.
తెలుగుగంగ ప్రధాన కాలువ, లింక్ కెనాల్కు రూ.500 కోట్లతో లైనింగ్ చేయడం ద్వారా సకాలంలో వెలిగోడు, బ్రహ్మంసాగర్ను నింపడానికి సీఎం జగన్ మార్గం సుగమం చేశారు. బ్రహ్మంసాగర్ మట్టికట్టకు డయాఫ్రమ్ వాల్ ద్వారా లీకేజీలకు అడ్డుకట్ట వేసి పూర్తి స్థాయిలో 17.74 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు.
ఈ ఐదేళ్ల పాలనలో వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం 1 .80 లక్షల కోట్లు ఖర్చు చేసింది. చంద్రబాబు పాలన చివరి ఏడాది 2018–19లో మన వ్యవసాయ రంగం సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో దేశంలో 12వ స్థానంలో ఉండగా ప్రస్తుతం జగన్ పాలనలో 13% వృద్ధి రేటుతో 6వ స్థానానికి ఎగబాకింది. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా పూర్తిచేయలేదు. పైగా వ్యవసాయం దండగ అనే స్టేట్మెంట్స్ ఇచ్చాడు. కానీ షర్మిల చంద్రబాబు చేసిన ద్రోహాన్ని విడిచిపెట్టి చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ ను వల్లెవేయడం గమనార్హం ..