ముఖ్యమంత్రి వైయస్.జగన్తో జేఎస్డబ్ల్యూ గ్రూప్ ఛైర్మన్ సజ్జన్ జిందాల్ తాడేపల్లి నివాసంలో సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా ఇరువురి మధ్యా కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పురోగతితో ఇతర అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలకు సజ్జన్ జిందాల్ ధన్యవాదాలు తెలియజేశారు.
జనవరి నుంచి ఉక్కు కర్మాగార నిర్మాణ పనులు మరింత వేగవంతం అవుతాయని వెల్లడించిన సజ్జన్ జిందాల్ జేఎస్డబ్ల్యూ గ్రూప్లో ఈ ప్లాంటు కీలక పాత్ర పోషిస్తుందని, రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో ఒక మైలు రాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. సౌరవిద్యుత్ రంగానికి సంబంధించి రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని జిందాల్ వెల్లడించారు. విజయనగరం జిల్లా ఎస్.కోట సమీపంలో ఎంఎస్ఎంఈ పార్కు అభివృద్ధికోసం అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని, వచ్చే నెలలో శంకుస్థాపకు సన్నద్ధమవుతున్నామని సీఎం జగన్ కు జిందాల్ తెలిపారు. రాష్ట్రంలో వెనకబడ్డ ప్రాంతాల్లో పారిశ్రామిక ప్రగతిని పోత్సహిస్తున్నామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని, పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని సీఎం జగన్ తెలిపారు.