ఒడమ్మాబడవా.. కాపాడండయ్యా నన్ను.. ఇదేం బాలేదయ్యా.. సోషల్ మీడియాలో మీమ్స్ పేజీల్లో ఎక్కువ దర్శనమిస్తుంటాయి. ఈ పదాలు పలికింది నెల్లూరు సోగ్గాడు ఆనం వివేకానందరెడ్డి. ఆయన చనిపోయినా ఇంకా యాసను మాత్రం జనం గుర్తుపెట్టుకునే ఉన్నారు.
వివేకా గదిలో చోరీ జరిగింది. ఈ విషయం ప్రస్తుతం నెల్లూరు నగరంలో కలకలం రేపింది. మూడురోజుల క్రితం కుటుంబసభ్యులు గోప్యంగా ఉంచారు. బుధవారం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై ఇంకా పోలీసులకు ఫిర్యాదు అందలేదు. ఆనం నెల్లూరు సిటీ, రూరల్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తన హావభావాలు, మాటలతో తెలుగు రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందారు. 2018 ఏప్రిల్ నెలలో అనారోగ్యంతో మృతిచెందారు. దీంతో బతికి ఉన్నప్పుడు ఆయనకు వాడిన దుస్తులు, బంగారు చైన్లు, ఇతర విలువైన వస్తువులను భద్రపరిచారు. ఆనం జీవించి ఉన్న రోజుల్లో ఇంట్లో పైగదిని తనకు నచ్చినట్లు డెకరేట్ చేయించుకున్నారు. విదేశాల నుంచి తెప్పించుకున్న వస్తువులు అందులో ఉంచారు. మరణానంతరం అక్కడికి ఎవరినీ వెళ్లనివ్వడం లేదు. జయంతి, వర్ధంతి రోజున తెరిచి కార్యక్రమాలు చేస్తారు. ఈ గదికి సంబంధించిన తాళాలు ప్రస్తుతం పెద్ద కుమారుడు ఏసీ సుబ్బారెడ్డి వద్ద ఉంటాయి.
సుబ్బారెడ్డి ఇటీవల కొద్దిరోజులు ఊర్లో లేరు. మూడురోజుల క్రితం వచ్చి చూసేసరికి ఆనం గదిలో వస్తువలన్నీ చిందరవందరగా పడి ఉన్నాయి. దీంతో దొంగతనం జరిగిందని గుర్తించారు. బయటి వ్యక్తులు చేశారా.. లేక బాగా తెలిసిన వారే చేశారా అనే అనుమానం కలుగుతోంది. సన్నిహితులకు మాత్రమే ఈ గదిలో ఆనం వస్తువులు ఉన్నట్లు బాగా తెలుసు. చోరీ కారణాలపై వాళ్లలో వారే చర్చించుకుంటున్నారు. కొద్దిరోజులుగా ఎవరు వచ్చారనే విషయాలను పరిశీలిస్తున్నారు. తెలిసిన వారు కావడంతోనే ఫిర్యాదు చేయడంలేదనే ప్రచారం ఉంది. గది వద్ద సీసీ కెమెరాలు లేవు. దీంతో ఎవరు చేశారో తెలుసుకునేందుకు తర్జనభర్జన పడుతున్నారు.