సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నమ్మి ఓట్లు వేసిన ప్రజల్ని మోసం చేయాలని ఏనాడూ ప్రయత్నించలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ ఊదరగొట్టేవారు. సమ్మిట్లు పెట్టి ఊరుపేరు లేని కంపెనీలతో ఎంఓయూలు కుదుర్చుకున్న చరిత్ర ఆయనది. రోడ్డుపై చిన్న చిన్న పనులు చేసుకునే వారికి సూట్లు వేసి పారిశ్రామికవేత్తలుగా చూపించారు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని చెప్పి యువతను మోసం చేశారు. ఇక బాబు ఏదైనా దేశానికి వెళ్తే ఫలానా వాళ్లు ఏపీని ఓన్ చేసుకున్నారని, చాలా పెద్ద పరిశ్రమ వస్తుందని ఎల్లో మీడియాలో చెప్పించేవారు. కానీ అదంతా డబ్బా కొట్టుకోవడమేనని తేలిపోయింది.
బాబులా జగన్ ఎప్పుడూ చేయలేదు. పెట్టుబడుల విషయంలో అత్యంత నిజాయతీగా వ్యవహరించారు. అందుకే దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవడంతో అదానీ, రిలయన్స్, బిర్లా లాంటి సంస్థలు ముందుకొచ్చాయి.
రిలయన్స్ బయో ఎనర్జీ, ఆదిత్య బిర్లా గ్రూప్తోపాటు పలు పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారు. ఈ పెట్టుబడుల విలువ రూ.4,178 కోట్లు. ఇంకా రూ.655 కోట్లతో ఏర్పాటు చేసిన ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లను సీఎం ప్రారంభిస్తారు. రిలయన్స్ బయో ఎనర్జీ రూ.1,024 కోట్ల పెట్టుబడితో తొలిదశలో కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, నెల్లూరుల్లో బయో గ్యాస్ ప్లాంట్లను పెడుతుంది. దీని ద్వారా 576 మంది ఉద్యోగాలు లభిస్తాయి. ఇక ఆదిత్య బిర్లా గ్రూప్ రూ.1,700 కోట్లతో తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేటలో మాన్యుఫ్యాక్చరింగ్ ఆఫ్ కార్బన్ బ్లాక్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఇందులో 250 మందికి ఉపాధి దొరుకుంది. ఇంకా హెల్లా ఇన్ఫ్రా, వెసువీఎస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఐసీ ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, అన ఒలియా ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలను జగనన్న నిర్వహిస్తారు. దీంతో మొత్తంగా 4,046 మంది ఉద్యోగావకాశాలు వస్తాయి.
ఇంత చేస్తున్నా జగన్ ఏనాడూ ఆర్భాటంగా ప్రచారం చేసుకోలేదు. అదే చంద్రబాబు విషయంలో అయితే జస్ట్ చర్చలు జరగ్గానే పచ్చ పత్రికలు పెద్ద పెద్ద అక్షరాలతో అహా.. ఓహో.. బాబు వల్లే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులంటూ రాసి మురిసిపోయేవి. ఇక తెలుగు తమ్ముళ్లయితే నారా వారంత విజనరీ లేరని రాగం అందుకునే వారు. దశాబ్దాలుగా ఇదే చేస్తూ జనాన్ని బురడీ కొట్టించారు. ఏమి చెప్పినా జనం నమ్మేస్తారులే అనుకుంటే పొరపాటే.. ఎందుకంటే పరిశ్రమంటే కళ్లెదుట కనిపించే నిజం. పేపర్లలో ఉండే కాకి లెక్కలు కాదు. అందుకే జగన్ అంటే నిజం. చంద్రబాబంటే అబద్ధం.