ప్రాంతీయ కార్యాలయ ఏర్పాటుకై ఆర్బీఐ విశాఖ వైపు చూస్తుంది. ఈ విషయమై విశాఖ జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఆర్ధిక శాఖ లేఖ రాసింది. అయిదేళ్ళపాటు లీజుకు అనువుగా ఉండేలా భవనాన్ని వెతుకమని ఆర్బీఐ కోరింది. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆర్బీఐ కార్యకలాపాల కోసమై అమరావతిలో పదకొండు ఎకరాల స్థలం కేటాయించామని అప్పటి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. అయితే అరకొర సదుపాయాలు, రోడ్లు, డ్రైన్లు, ఉద్యోగులు ఉండేందుకు అనువుగా వసతి లేకపోవడం తదితర అంశాలతో ఆర్బీఐ తమ కార్యాలయాన్ని అమరావతిలో ప్రారంభించడానికి సుముఖత చూపించలేదు. కేవలం వృధాగా భూమి మాత్రమే చూపించి మౌలిక వసతులు కల్పించకుండా అక్కడ కార్యాలయం స్థాపించాలని కోరడంపై కూడా ఆర్బీఐ సంతృప్తిగా లేదు.
గత అయిదేళ్ళుగా ఈ కేంద్రశాఖ కార్యాలయం హైదరాబాద్ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఎట్టకేలకు… ఆర్బీఐ విశాఖకు రావడానికి నిర్ణయించుకుంది. దానితో విశాఖకు మరొక కేంద్ర సంస్థ రాబోతుంది. మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనువుగా ఉండటంతో అమరావతి కన్నా విశాఖను అనువైన ప్రాంతంగా ఆర్బీఐ భావిస్తోంది.
తాగునీరు, మరుగుదొడ్లు, రోడ్లు, పార్కింగ్, విద్యుత్ కనెక్షన్, లిఫ్టు వంటి సదుపాయాలు ఉండి, సుమారు ముప్పై వేల నుంచి ముప్పైవేల అయిదువందల చదరపు అడుగుల వరకూ ఉండే భవనాన్ని గుర్తించి తమకు తెలియజేస్తే, ఆపై తమ ప్రతినిధులు దానిని పరిశీలిస్తారని ఈ లేఖ సందర్భంగా ఆర్బీఐ విశాఖ కలెక్టర్కు తెలిపింది.