వైయస్ జగన్ ప్రభుత్వంలో పలాస కేంద్రంగా నిర్మాణం చేపట్టిన 200 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ గత ఏడాది నవంబర్ 23 ప్రియతమ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభయిన సంగతి తెలిసిందే. పేద ప్రజల ఆరోగ్య నిమిత్తం, ఖరీదైన వైద్యం పేదలకు అందించాలనే ఉన్నతాశయంతో ప్రారంభమయిన ఈ హాస్పిటల్ మొదలుపెట్టిన నాలుగు నెలల్లోనే అధ్భుతమైన వైద్యాన్ని అందిస్తుంది.
కాగా నిన్న, ఈ పరిశోధన కేంద్రంలో ఓ అరుదైన ఆపరేషన్ జరిగింది. లావేరు మండలం, లావేటి మొదలు గ్రామానికి చెందిన వోయివోని భవానీ అనే డయాలసిస్ పేషెంట్కు పలాసలోని కిడ్నీ ఆస్పత్రిలో మంగళవారం ఏవీఎఫ్ గ్రాఫ్ట్ ఆప రేషన్ ను విజయవంతంగా పూర్తి చేశారు. భవానీకి ఏడాదిగా రెండు కిడ్నీలు పాడైపోయి డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఇటీవల అనేక ప్రాంతాల్లో డయాలసిస్ చేయించుకున్న కారణంగా చేతిపై ఉండే నరాలు పూర్తిగా పని చేయడం మానేయగా, ప్రైవేటు వైద్యులు కూడా చికిత్స చేయలేక చేతులెత్తేశారు.
దీనితో తీవ్ర నిరాశతో ఉన్న తల్లిదండ్రులు పలాస కిడ్నీ కేంద్రం గురించి తెలియడంతో ఇక్కడకి తీసుకురావడంతో డాక్టర్ కిషోర్ కుమార్ భవానీకి కృత్రిమంగా నరాలకు ప్రత్యేకమైన పైపును అమర్చి రక్తాన్ని శుద్ధి చేశారు. ఇకపై డయాలసిస్ చేసేటప్పుడు అమర్చిన పైపు వెంబడి రక్తశుద్ధి చేసి తిరిగి శరీరంలోకి పంపిస్తారు. ఈ కృత్రిమ పైపు అమరికను ఏవీఎఫ్ గ్రాఫ్ట్ అని పిలుస్తారు. ఇదే ఆపరేషన్ కార్పొరేట్ ఆస్పత్రిలో చేస్తే రూ. లక్ష అవుతుంది. అది కూడా గంటలోనే జరగాలి. పలాస కిడ్నీ ఆస్పత్రిలో ఆపరేషన్ విజయవంతం కావడంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పద్మజ వైద్యులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు. భవానీ తల్లిదండ్రులు తమకోసం మెరుగైన వైద్యం అందిస్తున్న జగన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు.