మన తెలుగోళ్ళకి కంప్యూటర్ని పరిచయం చేసింది ఎవరో మనందరికీ తెలిసిందే. మనం మరిచిపోతామేమో అని ఆయనే పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు కూడా. ఆయన అలా ఏమైనా అనగానే, ఇలా తెలుగుతమ్ముళ్లు “అవునవును ఆయన రాక ముందంతా రాతి యుగం, ఆయనొచ్చాక గుప్తుల కాలం, స్వర్ణయుగం” అంటూ గొప్పలు చెప్పుకుంటూ జబ్బులు చరచుకుంటారు.
అయితే, ఆయన కన్నా ముందు రాజకీయాలలోకొచ్చిన వాడూ, పైగా తెలుగువాడూ అయిన పీవీ నరసింహారావు గారి పడగ్గది కంప్యూటర్ నిధి అట. పీవి గారు 1980 నుండి కంప్యూటర్ వాడేవారట. ఆయన పడగ్గది నిండా కంప్యూటర్ లు, పుస్తకాలు, పేపర్లు ఉండేవట. ఆయన ఆ పడగ్గదిలోనే జాతీయ అభివృద్ధి ప్రణాళికలు, ఎన్నికలకు కావలసిన పరిశీలనలూ చేసేవారట కూడా. అలిసిపోయి నిద్ర పోబోయేముందు ఏదొక పుస్తకం చదివి నిద్రపోయేవారట. అదేంటి మరి మన బాబు గారి కన్నా ముందున్న పీవీకి కంప్యూటర్ గురించి ఎలా తెలిసిందబ్బా అని ఆశ్చర్యపోకండి. ఇంకా మనం తెలుసుకోవలసినవి చాలానే ఉన్నాయి.
బాబు గారు అధికారంలోకొచ్చి కంప్యూటర్లను ఆంధ్రాలోకి లాక్కురావడానికన్నా ముందే అంటే 1993 లోనే లోక్సభలో ఉన్న యంపీలు అందరికీ అప్పటి పార్లమెంటు స్పీకరు గారు రెండున్నర లక్షల విలువ చెసే లాప్టాపులను అందించారు. అందరితో పాటు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ రాజకీయ పార్టీల ఎంపిలకు కూడా లాప్ టాప్ లు ఇచ్చారట. ఇంటర్నెట్ ద్వారా పార్లమెంటులోని లైబ్రరీలో గల అన్ని పుస్తకాలను చదవగల అవకాశాన్ని కూడా కల్పించారు. పదవీ కాలం ముగియగానే వాటిని వెనక్కి ఇవ్వాలని కూడా చెప్పారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన మన తెలుగు ఎంపీలు ఆ కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోకుండా పక్కన పడేసారట. తెలుగు యంపీలు ఎందుకని కంప్యూటర్ నేర్చుకోలేదూ అని తలంటారు కూడా. వీటికి సంబంధించి అప్పటి పేపర్లలో వార్తలు కూడా వచ్చాయి. మరా టైంలో టీడీపీలో మామ వెనక నక్కిన చంద్రబాబు గారు వారికి కంప్యూటర్ పరిజ్ఞానం నేర్పకుండా గుడ్డి గాడిద పళ్ళు తోముతున్నారేమో పాపం .
కాబట్టి మహాశయులారా… బాబు కన్నా ముందే మన ఆంధ్ర లో టెక్నలాజీలు వాడేవారనీ, ఆయన వచ్చాకే మన వాళ్ళు టైపింగు నేర్చుకోవడం మొదలుపెట్టారనీ, ఆయన వలనే ప్రపంచం ముందుకు నడుస్తుందనే భ్రమలో నుంచి బయటపడండి.