చంద్రబాబు నాయుడి వెన్నుపోటు కారణంగానే ఎన్టీ రామారావు సీఎం సీటు పోయింది. ఆఖరికి జీవితమే బలైపోయింది. ఈ విషయాలు ఏపీ బీజేపీ చీఫ్ దుగ్గుబాటి పురందేశ్వరికి బాగా తెలుసు. కన్నతండ్రి విషయంలో జరిగిన పరిణామాలను చూసిన ఆమె స్వతహాగా అయితే వెన్నుపోటు రాజకీయాలకు దూరంగా ఉండాలి. కానీ మరిది అధికారంలోకి రావాలని పదవులిచ్చిన కమలం పార్టీకి ద్రోహం చేస్తున్నట్టు వార్తలొస్తున్నాయి
చంద్రబాబుకు జిత్తుల మారిన నక్కగా పేరుంది. తన స్వలాభం కోసం ఏమైనా చేస్తారు. ఎవరినైనా వాడుకుంటారు. ఏపీలోని ప్రతి పార్టీలో ఆయన కోవర్టులున్నారు. బీజేపీలోనూ అదే పరిస్థితి. అసలు కమలం పార్టీ ఇక్కడ ఎదగకపోవడానికి ప్రధాన కారణం నారా వారే. నాడు వెంకయ్య నాయుడిని అడ్డం పెట్టుకున్నారు. నేడు పురందేశ్వరి ద్వారా తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్నారు.
2019లో కాంగ్రెస్ నీడన చేరారు బాబు. అయితే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో కేసుల నుంచి తప్పించుకోవడానికి కమలం పెద్దల భజన ప్రారంభించారు. తన కోటరీలో ముఖ్యులైన సీఎం రమేష్, సుజనా చౌదరిని వెంకయ్య నాయుడి ద్వారా ఆ పార్టీలోకి పంపారు. అయితే ఇంతటితో ఆయన సంతృప్తి చెందలేదు. వారందరి ద్వారా ఎన్టీఆర్ వారసురాలు పురందేశ్వరికి ఏపీ అధ్యక్ష బాధ్యతలు ఇప్పిస్తే పార్టీ బలపడుతుందని కాషాయ పెద్దలను నమ్మించారు. దీని వెనుక బాబు కుట్ర ఉందని తెలుసుకోలేకపోయిన నేతలు ఆమెకు బాధ్యతలు అప్పగించారు.
వాస్తవానికి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన సమయంలో బాబు వెంట దగ్గుబాటి వెంకటేశ్వరరావు కీలకంగా ఉన్నారు. ఆయన భార్య పురందేశ్వరి పాత్ర కూడా ఉందని చెబుతుంటారు. అయితే చంద్రబాబు సీఎం కుర్చీ ఎక్కారు. వెంకటేశ్వరరావుకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని ఆశ పెట్టి చివర్లో హ్యాండ్ ఇచ్చారు. దీంతో భార్యాభర్తలు కొంతకాలం నారా వారితో విభేదించారు. కాలక్రమంలో తండ్రి వ్యతిరేకించిన కాంగ్రెస్లో చేరి పురందేశ్వరి కేంద్ర మంత్రి పదవి అనుభవించారు. తర్వాత బీజేపీ అధికారంలోకి రావడంతో అందులో చేరారు. ఎన్టీఆర్ కుమార్తె చేరిందని ఏపీలో తమ పార్టీ బలం పుంజుకుంటుందని కమలం పెద్దలు సంబర పడిపోయారు. ఆమెకు జాతీయ స్థాయిలో పార్టీ పదవులు ఇచ్చారు.
చంద్రబాబు రాయబారంతో పురందేశ్వరి, వెంకటేశ్వరరావు కరిగిపోయారు. పాత విషయాలు మరిచిపోయి ఆయన వెంట నడవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం ఏపీ బీజేపీ చీఫ్గా ఉన్న చిన్నమ్మ ఆ పదవి రావడానికి ప్రధాన కారకుడైన మరిది కోసమే పనులు చక్కబెడుతున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి తిడుతున్నారు. ఈ నేపథ్యంలో కాకి లెక్కలు చెప్పి అభాసుపాలైన సందర్భాలున్నాయి. కానీ ఆమె వెనక్కి తగ్గలేదు.
క్షేత్రస్థాయిలో తెలుగుదేశం పరిస్థితి ఏ మాత్రం బాగోలేదు. 2014 మాదిరిగానే ఈసారి జనసేన, బీజేపీతో కూటమి కట్టి ఎన్నికలకు వెళ్లాలనేది చంద్రబాబు ఆలోచన. సేన ఓ వైపు బీజేపీతో పొత్తులో ఉంటూనే మరోవైపు అనధికారికంగా టీడీపీతో కలిసి ఉంటూ వచ్చింది. ఇటీవల వారి మధ్య పొత్తు పొడిచింది. ఇక కమలం పార్టీతో పొత్తు కోసం బాబు ఎంతగానో ప్రయత్నించారు. వెంకయ్య నాయుడు తన పాత పరిచయాలు ఉపయోగిస్తున్నారు. సీఎం రమేష్, సుజనా చౌదరి, పురందేశ్వరి, సత్యకుమార్ లాంటి వాళ్లు తమ అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. మరోవైపు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా పొత్తు పెట్టుకోవాలని బీజేపీ పెద్దలను కోరారు. వారు తిట్టినా తుడిచేసుకుని బతిమాలుకుంటున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు ఈనెల 7వ తేదీన కేంద్ర హోంమంత్రి అమిత్షా, చీఫ్ జేపీ నడ్డాను ఢిల్లీలో కలిశారు. ఏమి చెప్పినా వింటానన్నారు. ఎన్ని సీట్లు కావాలన్నా ఇచ్చేస్తానని ప్రతిపాదన పెట్టారు. అయితే బాబును బిజెపి పెద్దలు నమ్మలేదు. దీంతో ఇప్పటి వరకు పొత్తు వ్యవహారం తేలలేదు.
మరోవైపు ఎన్నికలు సమీపిస్తుండటంతో బాబులో భయం మొదలైంది. సీట్లు ప్రకటించాలంటూ సొంత నేతల నుంచే ఒత్తిళ్లు అధికమయ్యాయి. దీంతో చేసిది లేక సేనకు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ సీట్లు ఇచ్చారు. తొలిజాబితాలో 94 మంది టీడీపీ అభ్యర్థులకు అవకాశం కల్పించారు. ఇక 57 అసెంబ్లీ, 22 ఎంపీ స్థానాలు బీజేపీ కోసం ఆపిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నాడు. కానీ కాషాయ పెద్దల నుంచి గ్రీన్సిగ్నల్ రాకపోవచ్చనే ఆలోచనతో పురందేశ్వరి ద్వారా కొత్త కుట్రలకు తెరతీశారు. బలమైన ఆర్థిక, రాజకీయ నేపథ్యం ఉండి టికెట్లు దక్కని టీడీపీ, జనసేన నేతలకు వైఎస్సార్సీపీలో తలుపులు తెరుచుకోకపోవడంతో ప్రత్యామ్నాయంగా రాష్ట్ర బీజేపీ చీఫ్, ఆమె మనుషులను సంప్రదించారు. వారు సరిగ్గా స్పందించకపోగా మీరు ఆయా పార్టీల్లో ఉండటమే మేలు. అక్కడే న్యాయం జరుగుతుందని సర్దిచెప్పి వెనక్కి పంపిస్తున్నారు.
ఇక వైఎస్సార్సీపీ రాజకీయ సమీకరణాల దృష్ట్యా కొందరిని పక్కన పెట్టింది. వారిలో మాగుంట శ్రీనివాసులురెడ్డికి ఒంగోలు ఎంపీ సీటును జగన్ నిరాకరించారు. అలాగే నెల్లూరు చెందిన రాజ్యసభ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని (వీపీఆర్) పక్కన పెట్టగా వారిద్దరూ పురందేశ్వరి భర్త వెంకటేశ్వరరావును కలిసి కమలం పార్టీలో చేరుతామని మనసులో మాట చెప్పారు. దీనికి దగ్గుబాటి మేమే ఎందుకు వచ్చామా అని బాధపడుతున్నాం. ఇక్కడికి వచ్చి మీరేం చేస్తారు. భవిష్యత్ బాగుండాలంటే తెలుగుదేశంలో చేరండంటూ సాగనంపారు. ఈ విషయం తెలియని నెల్లూరు జిల్లా బీజేపీ ముఖ్య నేతలు వీపీఆర్ను తమ పార్టీలోకి ఆహ్వానించేందుకు వెళ్లారు. కానీ ఆయన సుముఖత చూపలేదు. అప్పటికే టీడీపీ అధిష్టానం టచ్లోకి వెళ్లి ప్రలోభాలకు గురి చేసింది. లేకపోతే ఆయన బీజేపీలో చేరాల్సి ఉంది. వెంకయ్య నాయుడు కూడా వద్దని చెప్పడంతో ఆగిపోయారు.
పార్టీలో చేరికల విషయమై పురందేశ్వరి ఫోన్ కాల్ ఆడియో రికార్డింగ్ ఒకటి కేంద్ర పెద్దల చేతుల్లోకి వెళ్లిందని సమాచారం. దీంతో ఇంటెలిజెన్స్ ద్వారా కొన్ని విషయాలు తెలుసుకున్నారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్షా.. చిన్నమ్మ తీరుపై సీరియస్గా ఉన్నారట . వారి ఆదేశాలతో అధిష్టానం ఆమెను అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించాలని చూస్తోంది. ఇప్పటికే రాజీనామా పత్రంపై సంతకం చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఇది ఎన్నికలకు ముందే జరుగుతుందా.. అయ్యాక జరుగుతుందో తెలియాల్సి ఉంది.
దేశంలో ఉత్తరాది రాష్ట్రాల్లో చాలా చోట్ల బీజేపీ పాగా వేసింది. దక్షిణాదిన బలంగా తయారేందుకు వ్యూహాలకు పదును పెట్టింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఏపీపై దృష్టి పెట్టినా ఎదగలేకపోయింది. దీనికి కారణం చంద్రబాబు మనుషులు. వారు పేరుకు కమలం కండువా కప్పుకొని ఉంటారు. కానీ బాబు ఎలా చెబితే అలా ఆడుతారు. ఆయనపై ఈగ వాలకుండా చూసుకోవడమే పని. ఎన్టీఆర్ కుమార్తె కదా అని కేంద్ర పెద్దలు పురందేశ్వరికి అధ్యక్షురాలి బాధ్యతలు ఇచ్చారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయండని వనరులు సమకూర్చారు. అయితే ఆమె అవన్నీ పక్కన పెట్టి తన సోదరి భర్త అయిన చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చే పనిలో నిమగ్నమయ్యారు.
ఇప్పుడు జరిగిన నష్టం కమలం పెద్దలకు తెలియడంతో ఆమె పోస్టుకే ఎసరు పెట్టారు. బాబును నమ్మిన వారు బాగుపడినట్లు చరిత్రలో లేదు. గతంలో డిప్యూటీ సీఎం పదవి పేరుతో మోసం చేసిన వ్యక్తి. ఈసారి ఏమి ఆశ చూపించాడో కానీ దుగ్గబాటి దంపతులు ఆయన్ను గుడ్డిగా నమ్మి మునిగిపోయారు. అలా అని ఇప్పుడు నారా వారు ఆ ఇద్దర్నీ చేరదీస్తారా అంటే ఆ అవకాశమే లేదు. అవసరం కోసం వాడుకున్నాడు.. కరివేకులా తీసి పారేస్తాడు. తన కోసం కాషాయ పార్టీలో పనిచేసే మరో నాయకుడిని వెతుక్కుంటాడు.