‘నాకు చంద్రబాబులా పదిమంది పొలిటికల్ స్టార్ క్యాంపెయినర్లు లేరు. అబద్ధాలకు రంగులు పూసే పచ్చ మీడియా లేదు. రకరకాల పార్టీలతో పొత్తుల్లేవు. ఒంటరిగానే ఎన్నికలకు వెళ్తున్నా. నాకు ఉన్నదల్లా పేదింటి స్టార్ క్యాంపెయినర్లే. ప్రతి ఒక్కరూ మీ బిడ్డ కోసం నడుం బిగించాలి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని మేదరమెట్లలో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆయన ప్రసంగించారు.
జగన్ మాటల్లో ‘చంద్రబాబు కిచిడి మేనిఫెస్టో తీసుకొచ్చాడు. ప్రతి సంవత్సరం రూ.1.40 లక్షల కోట్లు ప్రజలకు ఇస్తానంటున్నారు. మరోసారి మోసం చేయడానికి వచ్చాడని అర్థమవుతోంది. మనం కోవిడ్ సమయంలో కూడా మాట దాటకుండా సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందించాం. నేరుగా అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి రూ.2.60 లక్షల కోట్లు పంపించాం. నాన్ – డీబీటీ ఖర్చు రూ.1.10 లక్ష కోట్లు. ఈ సంక్షేమాన్ని తట్టుకోలేక రాష్ట్రాన్ని శ్రీలంక చేస్తున్నారని అప్పుడు చంద్రబాబు వాదించారు. ఇప్పుడు అదే నోటితో ఆరు వాగ్దానాలు వదిలారు. ఏటా ఎంత ఖర్చవుతుందని లెక్కిస్తే.. మనం అమలు చేస్తున్న పథకాలు కొనసాగాల్సిందే. చంద్రబాబు మేనిఫెస్టోకు శకుని చేతిలోని పాచికలకు తేడా లేదు.
చంద్రబాబు పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్క స్కీం కూడా లేదు. అందుకే పొత్తు కోసం ప్యాకేజీ ఇచ్చి దత్తపుత్రుడిని తెచ్చుకున్నాడు. అతను సీఎం సీటు అడగడు. సైకిల్ దిగమంటే దిగుతుడు, ఎక్కమంటే ఎక్కుతాడు. 2014లో కూటమిగా ఏర్పడి ఒకే స్టేజీ మీద కూర్చొని ప్రసంగాలు చేశారు. చంద్రబాబు సంతకం పెట్టి ప్రతి ఇంటికీS పాంప్లెట్ పంపించాడు. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ, మహాలక్ష్మి పథకం, నిరుద్యోభృతి, బీసీ సబ్ ప్లాన్, చేనేత రుణాల మాఫీ, మూడు సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాం.. రాష్ట్రాన్ని సింగపూర్గా మార్చేస్తామన్నారు. ఆ కూటమి ఇచ్చిన హామీలు ఏ ఒక్కటైనా అమలయ్యాయా? ప్రత్యేక హోదా ఇచ్చారా.. ఇవి చేయకుండా, మరోసారి పొత్తుల డ్రామాతో మీ ముందుకు వస్తున్నారు. చంద్రబాబు పొత్తుతో ఎవరికైనా ప్రయోజనం జరిగిందా? మంచి చేసిన జగన్ను టార్గెట్ చేయడమే వీళ్ల ఏకైక అజెండా. వీరందరికీ సైన్యాధిపతులే తప్ప సైన్యం లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాతో కూడా పోటీ పడలేకపోయాయి. వారు చెప్పుకునేందుకు మంచి లేదు కాబట్టి పొత్తుల కోసం పాకులాడుతున్నారు.
2019లో మీ బిడ్డ వస్తాడు.. మంచి రోజులు తీసుకువస్తాడని చెప్పా. మళ్లీ ఐదేళ్ల తర్వాత మరో మాట చెబుతున్నా.. ఈ మాటను ప్రతి ఊర్లో చెప్పండి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే మళ్లీ జగనన్ననే తెచ్చుకుందాం. బాబు అనే మాయ లేడి వలలో పడొద్దని చెప్పండి. నాపై అర డజన్ బాణాలు ఎక్కుపెట్టాయి. అయినా పొత్తులను నమ్ముకోలేదు. ఒంటరిగానే సింహంలా నిలబడ్డా. మనం చేసిన మంచిని ప్రతి గడపకు తిరిగి చెబుతుంటే చంద్రబాబు ఐదేళ్లుగా తన పెత్తందారుల వెంటే తిరుగుతున్నాడు. ఇది జగన్ మార్క్ రాజకీయం. నాకు విలువలు ఉన్నాయి. మన ఫ్యాన్ తిరగాలంటే కరెంట్ నేరుగా ప్రజల నుంచి వస్తుంది. ప్రతి ఇంటికి చేసిన మంచి నుంచి వస్తుంది. నవరత్నాల నుంచి వస్తుంది.
చంద్రబాబుకు ఓటు వేయడమంటే పథకాల రద్దుకు ఆమోదం తెలిపినట్లే. వివక్ష రాజ్యం మళ్లీ వస్తుంది. వలంటీర్ వ్యవస్థ రద్దవుతుంది. ఇంగ్లిష్ మీడియం ఉండదు.æ వైద్యం కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. రైతుల్ని మోసం చేస్తాడు. సీఎంగా అన్న మళ్లీ వస్తేనే పింఛన్ వస్తుంది. అమ్మఒడి, చేయూత, రైతు భరోసా, వసతి, విద్యా దీవెన అందుతుంది. జగన్ని గెలిపిస్తేనే అక్కచెల్లమ్మల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వస్తాయి. ప్రభుత్వ బడి, ఆస్పత్రి బాగుంటాయి. వైఎస్సార్సీపీకి ఓటు వేయడమంటే మీ బిడ్డ బంగారు భవిష్యత్తుకు ఓటు వేసినట్లే. మన మేనిఫెస్టో త్వరలో విడుదలం చేస్తాం. చేయగలిగిందే చెబుతాం. పేద పిల్లలకు క్వాలిటీ చదువు అందించడం నా లక్ష్యం. అక్కచెల్లమ్మల ముఖంపై చిరునవ్వులే నా కల. కరువు లేకుండా వ్యవసాయాన్ని మార్చాలని రైతులకు అండగా ఉండాలని నా కల. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, బీసీలు పేదరికంలో ఉండకూడదు, వారికి కావాల్సినవి ఇవ్వడమే మీ బిడ్డ సంకల్పం. వైద్యం కోసం అప్పులపాలు కాకుండా చేయడమే నా కల.
అధికారమంటే మీ బిడ్డకు వ్యామోహం లేదు. నా పేరు ప్రతి చరిత్ర పుస్తకంలో ఉండాలనదే కోరిక. ప్రతి పేదవాడి ఇంట్లో ఒక ఫొటో ఉండాలనేదే కోరిక. మాట మీద నిలబడే నాయకుడు కావాలా.. నాయకుడంటే తగ్గదే లే అని చెప్పే జగన్ లాంటి నాయకుడు కావాలా?. ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి ఇలాంటి వాడు మా నాయకుడు అని చెప్పుకోగలగాలి. దేవుడి దయ ప్రజలందరి దీవెనలతో మరో రెండు నెలల్లో ‘జగన్ అనే నేను’ మీ సేవకుడిగా సిద్ధం. మీరు సిద్ధమా..