నేడు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రథమ పేజీలో ఫుల్ పేజ్ యాడ్ ఒకటి వచ్చింది. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ గురించిన యాడ్ అది. ప్రతీ పత్రికలో యాడ్స్ రావడం సహజమే కానీ ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన యాడ్ లో ఓ విశేషం దాగుంది. గతంలో అనగా ఫిభ్రవరి 1 వ తేదీన పెమ్మసాని చంద్రశేఖర్ పై వ్యతిరేక వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించింది. ‘ఎవరీ పెమ్మసాని’ అంటూ సాగిన ఆ కథనంలో పెమ్మసానిపై విషం కక్కే ప్రయత్నం ఆంధ్రజ్యోతి చేసింది.
వాస్తవానికి గుంటూరు ఎంపీ స్థానంనుండి విజయం సాధించిన గల్లా జయదేవ్ రాజకీయాల నుండి తప్పుకోవడంతో ఆ స్థానం కోసం పలువురు ఆశావహులు బరిలో నిలిచారు. కాగా ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ భాష్యం రామకృష్ణకు గుంటూరు ఎంపీ స్థానం ఇప్పించేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు చూపు ఎన్ఆర్ఐ పెమ్మసాని చంద్రశేఖర్ వైపు ఉండడంతో తను సూచించిన అభ్యర్ధికి టికెట్ ఇప్పించాలన్న పంతంతో పెమ్మసానిపై విషం చిమ్మే ప్రయత్నం రాధాకృష్ణ చేయడం గమనార్హం. పెమ్మసాని ఎన్ఆర్ఐ అని చుట్టం చూపుగా వచ్చిపోతారని, ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం తక్కువని, పెమ్మసానికి టికెట్ ఇవ్వడం పట్ల టీడీపీ కేడర్ అసంతృప్తిగా ఉందంటూ తన పత్రికలో రాసుకొచ్చారు రాధాకృష్ణ.
కట్ చేస్తే నెల రోజుల తర్వాత ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజ్ యాడ్ పెమ్మసాని గురించి రావడం చూసి ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల క్రితం ఇదే పత్రిక కదా పెమ్మసానికి వ్యతిరేకంగా రాసింది ఇప్పుడేమో అదే వ్యక్తి గురించి ఫుల్ పేజ్ యాడ్ ఇచ్చిందంటూ టీడీపీ కేడర్ లో చర్చ జరుగుతుంది. పెమ్మసానికి రాధాకృష్ణకు తెరవెనుక ఒప్పందం జరిగిందని అందుకే ఈ యాడ్ వచ్చిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాధాకృష్ణ టార్గెట్ చేసి అనుకున్నది సాధించాడని ఏదేమైనా ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో ఎలా లాగాలో రాధాకృష్ణకి తెలిసినంతగా మరొకరికి తెలియదని పలువురు చర్చించుకుంటున్నారు. కాగా పెమ్మసాని చంద్రశేఖర్ వెనుక ఉన్న ఆర్థిక బలం చూసే చంద్రబాబు పెమ్మసానికి టికెట్ ఇచ్చాడని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మరి పెమ్మసాని రాధాకృష్ణల బంధంలో ఇంకెన్ని యాడ్స్ వస్తాయో వేచి చూడాలి.