పొత్తులో భాగంగా టికెట్ల ప్రకటించాక తెలుగుదేశం, జనసేన శ్రేణుల్లో ఆగ్రహావేశాలు ఎక్కువయ్యాయి. టీడీపీ తీసుకున్న 94 సీట్లలో చాలావాటిని సేన నేతలు ఆశించారు. తమకే ఇస్తారని గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే వారికి ఝలక్ ఇచ్చారు. దీంతో రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్కు శనివారం మొదలైన తలనొప్పి ఇప్పట్లో తగ్గేలా లేదు. పెడన టికెట్ను బాబు కాగిత కృష్ణప్రసాద్కు ప్రకటించారు. దీంతో మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ బోరుమని విలపించారు. తనకే అవకాశం వస్తుందని ఆశిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే సీటు దక్కకపోవడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 2019లో బాబును నమ్మి టికెట్ వదులుకుంటే ఇప్పుడు మోసం చేశారని ఆవేదన చెందారు. అస్వస్థతకు గురైన వేదవ్యాస్ను నేతలు ఆస్పత్రికి తరలించారు. అంతకుముందు బాబు, పవన్ను కలిసి నిలదీస్తానని ఆయన ప్రకటించారు. ఇండింపెండెంట్గా పోటీ చేస్తానన్నారు.
ఇదిలా ఉండగా పెడన టికెట్ టీడీపీకి కేటాయించడంతో జనసేన కార్యకర్తలు ఆగ్రహంతో రగిలిపోతూ రోడ్డెక్కారు. ఏకంగా కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పదేళ్లుగా కష్టపడితే, ఆశలు అడియాశలు చేశారని వాపోయారు. తమకి చెప్పకుండా పెడన టికెట్ టీడీపీకి ఎలా ఇస్తారని నిలదీశారు. రామకృష్ణ తెలుగుదేశానికి అమ్ముడుపోయారంటూ కన్నెర్ర చేశారు. అతడి వల్లే టికెట్ జనసేనకు రాకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెడన టికెట్పై పవన్ కళ్యాణ్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. నిర్ణయం మారకపోతే రెండు రోజుల్లో కార్యాచరణ సేన నేతలు ప్రకటించారు.
దీనిపై కృష్ణప్రసాద్ వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అన్ని సర్వేలు చేసి తమ నేతకు అవకాశం ఇస్తే సేన నేతలు ఓవరాక్షన్ చేస్తున్నారని మండి పడుతున్నారు. వేదవ్యాస్ పనైపోయిందని, ఆయన ఇక రాజకీయాల నుంచి రిటైర్ అవ్వాల్సిన సమయం వచ్చేందని చెబుతున్నారు.