నేనేం చేసినా రాష్ట్ర కళ్యాణం కోసమే అంటున్నారు పవన్ కళ్యాణ్. గతంలో తెలంగాణ వచ్చినపుడు పదకొండు రోజులు అన్నం మానేసాను అన్న చందాన ఇప్పుడు ఆయన రాష్ట్ర బాగు కోసం మాటలు పడుతున్నాను అనడం కూడా నవ్వులపాలు అవుతుంది.
ఏ రాష్ట్రంలో ఏ పార్టీతో పొత్తులో ఉంటుందో తెలియని జనసేన పార్టీ, చంద్రబాబు జైలులో ఉండేసరికి హఠాత్తుగా టీడీపీతో పొత్తుకి సిధ్ధమైపోయింది. అంతకు ముందు తెలంగాణాలో బీజేపీతో పొత్తులో ఉండి, విపరీతంగా ప్రచారం చేసుకున్నా ఒక్కచోట కూడా గెలవలేక, చాలా చోట్ల డిపాజిట్లు రాక గల్లంతైన తన పార్టీ… ఆంధ్ర లో మాత్రం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మార్చడం కోసమే పాటు పడుతుంది అనే కలరింగ్ ఇవ్వడం కోసం జనసేనాని కష్టపడుతున్నారు.
టీడీపీతో జతకట్టడానికి, ఆపై తాను ఎప్పటినుంచో అంటకాగుతున్న బీజేపీని టీడీపీతో కలపడానికి జాతీయనాయకులతో నానా మాటలు పడ్డాను అని పవన్ కళ్యాణ్ నిన్న వాఖ్యలు చేసారు. రెండు చేతులు జోడించి దండం పెట్టి మరీ పొత్తు కోసం అడిగాననీ, ఇదంతా తన కోసం కాదని… రాష్ట్ర భవిష్యత్తు బాగుంటే అంతే చాలని అన్నారు.
అయితే మరొకవైపు… చిన్నమ్మ విపరీత చొరవ చూపడం వల్ల బీజేపీ పొత్తుకు ఒప్పుకుంది అని బీజేపీ వాళ్ళు అంటుంటే, బాబు చాణక్యం నచ్చి బీజేపీ వాళ్ళు వచ్చారని టీడీపీ వాళ్ళు అంటున్నారు. నిఘా వర్గాలు ఏమన్నారో కూడా పబ్లిక్ మీటింగులలో చెప్పే… పవన్ కళ్యాణ్ తాను ఏ జాతీయ నాయకుడి ముందు చేతులు కట్టుకున్నారో మాత్రం చెప్పట్లేదు. ఇంకోవైపు కాపు నాయకులు అంతా… పవన్ కళ్యాణ్ ఎందుకు టీడీపీ ముందు చేతులు కట్టుకుంటున్నాడు అని తలలు బాదుకుంటుంటే, హరిరామ జోగయ్య వంటి సీనియర్లు… “ఇంతోటి పొత్తు వల్ల మనకొచ్చే సీట్లు ఎన్ని?” అంటూ లేఖలు రాసి మరీ పవన్ కళ్యాణ్ తలంటుతున్నారు. ఇన్ని రకాలుగా చుట్టూ ఉన్నవారు విమర్శిస్తున్నా… పవన్ మాత్రం తానేదో రాష్ట్ర భవిష్యత్తును ఉదయింపజెసేందుకు, అస్తమిస్తున్న సూర్యుడి వైపు వెళుతూ త్యాగం చేస్తున్నట్టు ఫీలవుతున్నారు. మరి ఇంతలా భవిష్యత్తు గురించి ఆలోచించే పవన్ కళ్యాణ్ మధ్యలో టీడీపీని ఎందుకు వదిలిపెట్టారో మాత్రం నాదెండ్ల వంటి వారు చెప్పలేని భేతాళ ప్రశ్నలా మిగిలిపోయింది.