బహుశా జానీ సినిమా సమయంలో కాబోలు.. తన తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇండియాలోనే బెస్ట్ స్టోరీ టెల్లర్గా నిలుస్తారని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో అన్నారు. అది నిజమే.. మూవీస్లో సక్సెస్ కాలేకపోయినా రాజకీయాల విషయానికొస్తే సేనానిని కొట్టే స్టోరీ టెల్లర్ లేరు. 2014లో జనసేన పార్టీని స్థాపించిన నాటి నుంచి తన నేతలు, కార్యకర్తలు, అభిమానులకు ఏదో ఒక కథ చెబుతూనే ఉన్నారు. వారు నమ్ముతూనే ఉన్నారు. భారతీయ జనతా, తెలుగుదేశం పార్టీలతో కలిశాడు. ఆ సమయంలో ఏవో కథలు చెప్పాడు. అందరూ నమ్మారు. వారి నుంచి విడిపోయాడు. సభల్లో తిట్టాడు. అభిమానగణం బుట్టలో పడిపోయింది. 2019 ఎన్నికల సమయంలో బీఎస్పీ, కమ్యూనిస్టులను కలుపుకొన్నాడు. కొంతకాలానికే విడిపోయాడు. 2024 ఎన్నికలు వచ్చే సరికి చాలా కథలు చెప్పి మళ్లీ టీడీపీ, బీజేపీతో జత కట్టాడు.
చంద్రబాబు 24 అసెంబ్లీ, మూడు పార్లమెంట్ స్థానాలు ఇవ్వగానే మహాప్రసాదంలా తీసుకోవడంతో సేనానిపై సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అలిగారు. కాపులైతే దూరం జరిగారు. దీంతో తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభలో తనను ప్రశ్నించేవారు కాదు.. వెంట నడిచే వారు కావాలన్నాడు. 24 సంఖ్యకు చాలా ప్రాముఖ్యత ఉందని పురాణాల గురించి చెప్పాడు. 3 ఎంపీలంటే 18 నుంచి 20 అసెంబ్లీ స్థానాలు. ఇలా చూసుకుంటే మనకు 40పైనే దక్కాయని నమ్మించాడు.
ఇప్పుడు కూటమిలో బీజేపీ చేరింది. చంద్రబాబుకు వీళ్లే ఎక్కువ. పవన్ను సైడ్ చేయాలని చూశాడు. కమలం పార్టీకి పది అసెంబ్లీ, ఆరు లోక్సభ సీట్లు ఇచ్చాడు. జనసైనికులు భయపడినట్లుగానే వారికిచ్చిన వాటిలో మూడు అసెంబ్లీ, ఒక ఎంపీ తగ్గించేశాడు. మొదటి నుంచి అధిక సీట్లు తీసుకోలేదని, పవర్ షేరింగ్ అడగలేదని కోపంగా ఉన్న తన వాళ్లకి ఇప్పుడు సేనాని ఏ కథ చెప్తాడోనని అందరూ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో సెటైర్లు విపరీతంగా వస్తున్నాయి.
రేపు ఏదైనా ఎన్నికల సభ జరిగితే పవన్ చెప్పబోయే కహానీలు చాలా ఉన్నాయి. అందులో జగన్ను దింపాలంటే త్యాగాలు చేయక తప్పదు ఒకటి. 21 నంబర్ పెరుగుదల, ఐక్యతను సూచిస్తుంది. అందుకే అన్ని తీసుకున్నా అనొచ్చు. చాలా దేశాల్లో 21 సంవత్సరాల వయసు వారిని మెజార్టీగా పరిగణిస్తారు. సో మనం ఎంత మాత్రం ఇక మైనార్టీ కాదని చెప్పే అవకాశాలున్నాయి. రెండు నంబర్ అంటే నాకు చాలా ఇష్టం. ఖుషీ, ఓజీ, జల్సా, బద్రి, జానీ, పంజా, బాలు సినిమా పేర్లు రెండు అక్షరాలే. ఒక అక్షరంతో కూడా సినిమా తీశాను.. అదే బ్రో. ఇక రెండు ప్లస్ ఒకటి కలిపితే మూడవుతుంది. సూపర్హిట్ మూవీ తమ్ముడు ఎన్ని అక్షరాలు మూడే కదా.. నేను పిచ్చిడినై 21 సీట్లే తీసుకోలేదు. దీని వెనుక ఇంత కథ ఉంది. ఎంతో కసరత్తు ఉంది. రెండు ఎంపీ సీట్లంటే 14 అసెంబ్లీతో సమానం. 21.. 14 కూడితే 35 వస్తుంది. ఎవరైనా అడిగితే రొమ్ము విరుచుకుని చెప్పండి జనసేన 35 సీట్లలో పోటీ చేస్తోందని.. ఇలా సేనాని కథలు చెప్పగానే గుడ్డిగా నమ్మేవాళ్లు ఉన్నారు కాబట్టే మోసం చేస్తూనే ఉన్నాడు. ఆనాడు చిరంజీవి చెప్పింది దీని గురించేనేమో.. నిజంగా స్టోరీ టెల్లింగ్లో నిన్ను కొట్టేవాడు లేడని ఇప్పుడు ఆయన కూడా అనుకుంటూ ఉంటాడు. నమ్మించడం నటుడి లక్షణం. పవన్ అదే చేస్తున్నాడు.. తన కథలతో అభిమానుల్ని గొర్రెల్ని చేస్తూనే ఉన్నాడు.