పాపం.. హరిరామజోగయ్య.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై ఎన్నో ఆశలు, నమ్మకం పెట్టుకుని నిండా మునిగిపోయారు. ఉభయ గోదావరి జిల్లాలో ప్రస్తుతం కాపు నేతల ఆవేదన ఇది. తన సామాజికవర్గాన్ని రాజ్యాధికారం దిశగా నడిపించేందుకు ఆ పెద్దాయన చేసిన ప్రయత్నాలు నీరుగారిపోవడంతో కాపు సంక్షేమ సేనను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం లేఖ విడుదల చేశారు.
తెలుగుదేశం – జనసేన పొత్తులో పవన్ కీలక పాత్ర పోషించాలి. 50 నుంచి 60 అసెంబ్లీ సీట్లు తీసుకోవాలి. సీట్లు ఎవరికి ఇవ్వాలి తదితర విషయాలపై జోగయ్య సేనానికి లేఖలు రాశారు. కానీ సీట్లు తక్కువగా తీసుకోవడంతో కనీసం సీఎం పదవి, సమానంగా మంత్రి పదువులు తీసుకోవాలని సూచించారు. కానీ పవన్ ఏ మాత్రం పట్టించుకోలేదు సరి కదా.. తాడేపల్లిగూడెం ఉమ్మడి సభలో తనకు సలహాలు ఇచ్చే వారు కాదని, వెంట నడిచే వారు కావాలని పరోక్షంగా జోగయ్యపై ఫైరయ్యారు. దీంతో పెద్దాయన మనసు విరిగిపోయినట్లు ఉంది. మిమ్మల్ని బాగు చేయడం ఎవరి తరం కాదని వదిలేశారు. కాపుల ఆత్మగౌరవాన్ని పవన్ చంద్రబాబు కాళ్ల దగ్గర తాకట్టు పెట్టాడనే నిర్ణయానికి వచ్చేశారు. దీంతో తాజా లేఖలో సేనానికి తలహాలు ఇవ్వడం తనకు శాపంగా మారిందని, జనసైనికులు కొందరు అమర్యాద మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
లేఖలోని కొన్ని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. కొందరి మిత్రుల సలహా మేరకు కాపు సంక్షేమ సేనను స్థాపించాను. విద్య, ఉద్యోగాల్లో ఐదు శాతం రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహారదీక్ష చేశాం. అయితే సంక్షేమ సేన రాజకీయాల్లోకి ప్రవేశించి తప్పు చేసింది. పవన్ను సీఎం చేస్తే కాపులకు న్యాయం జరుగుతుందని ఆయనకు సలహాలు ఇచ్చాను. కానీ నన్ను తిడుతున్నారు. ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఎంపీ పదవి వదులకుని ఆ పార్టీలో చేరా. చిరంజీవి దానిని కాంగ్రెస్లో కలిపేశారు. దీంతో నాతోపాటు చాలామంది కాపులు నష్టపోయారు. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదనే నా తపన. కమిటీని తాత్కాలికంగా రద్దు చేశాం. జూన్ నుంచి కొత్త కమిటీలను కొనసాగిస్తాం.
ఓట్ల కోసం తాను కాపునని సభల్లో చెప్పే పవన్.. ఆ సామాజికవర్గంలోని పెద్ద మనిషి మాటలు వినకుండా చంద్రబాబుకు వంత పాడుతున్నారు. దీంతో కాపులందరూ సేనాని తీరును చీత్కరించుకుంటున్నారు. ఒక్క సలహా కూడా పాటించకుండా పరోక్షంగా ఆయనపైనే ఆగ్రహం వ్యక్తం చేయడాన్ని జీర్ణియించుకోలేకపోతున్నారు. నిజానికి జనసేన పెట్టిన నాటి నుంచి అది బాబు కోసమే పనిచేస్తోంది. తనకు సలహాలు ఇచ్చే స్థాయికి ఎవరికీ లేదనే భావనలో ఆ పార్టీ అధినేత ఉన్నారు. అందుకే జోగయ్యను కూరలో కరివేపాకులా తీసిపాడేశారు.
– వీకే..