జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈసారి కాకినాడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. 2019లో ఆయన గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. ఈసారి టీడీపీలో పొత్తులో భాగంగా మళ్లీ భీమవరం నుంచే బరిలో ఉంటారని భావించారు. అలాగే చాలా నియోజకవర్గాల పేర్లు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఎంపీగా నిలబడాలనే ఆలోచనలో ఉన్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సేనానిపై సోషల్ మీడియాలో (ఎస్ఎం) సెటైర్లు బాగా పేలుతున్నాయి. పర్యటనల్లో భాగంగా ఏదైనా ఊరికి వెళ్తే.. నాకు ఈ ప్రాంతంతో అనుబంధం ఎక్కువంటూ ఆయన నోటికొచ్చింది మాట్లాడేవారు. పుట్టిన ఊరి పేర్లు లెక్కలేనన్ని చెప్పారు. దీంతో అప్పట్లోనే ఎస్ఎంలో ఒకాట ఆడుకున్నారు.
ఒకవేళ కాకినాడ నుంచి పవన్ ఎంపీగా పోటీ చేస్తే.. అక్కడ సభ జరిగితే ఆయన ఎలా మాట్లాడుతాడో అంటూ ఫేస్బుక్, ట్విట్టర్ (ఎక్స్) ఒక పోస్టు వైరలైంది. ‘నేను కాకినాడ జీజీహెచ్ (గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్)లో పుట్టాను. మా నాన్నగారు కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పని చేశారు. నేను కాకినాడ ఆదిత్య కాలేజ్లో ఎంబీబీఎస్ చదివాను. మా అమ్మగారు ఎస్ఆర్ఎంటీ మాల్లో షాపింగ్ చేసేవారు. నేను ఉప్పాడ బీచ్లో చేపలు పట్టేవాడిని. ఇంద్రపాళెం వెళ్లి బజ్జిలు తినేవాడిని. నేను, నా కాకినాడ స్నేహితులు కలిసి బాలాజీ చెరువు దగ్గర సాయంత్రం టైంలో పార్క్కి వచ్చే అమ్మాయిలకు లైన్ వేసే వాళ్లం. కోటయ్య గారి కాజాలు అనే నాకు చాలా ఇష్టం. సుబ్బయ్య గారి హోటల్ వెజ్ మీల్స్ అంటే ప్రాణం. నా పుట్టిన రోజుకు జీఆర్టీ గ్రాండ్స్లో పార్టీ ఇచ్చాను. అప్పుడప్పుడు నైట్స్ పెద్దాపురం దర్గా సెంటర్కి వెళ్లేవాళ్లం. ఇక్కడ ఉండగానే నరేంద్రమోదీ, చంద్రబాబు పెద్ద లీడర్లు అవుతారని మనసులో అనుకున్నాను. ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలాసార్లు భావించా. కాకినాడ ఏపీ రాజధాని అయ్యుంటే బాగుండేది’ ఇదంతా ఆయన పీఏ ద్వారా లీకైందంటూ ఎవరో సరదాగా పోస్టు చేశారు.
పవన్ మాటలు చాలా సభల్లో ఎప్పుడూ పైన చెప్పిన విధంగానే ఉండేవి. స్థానిక ప్రజలను ఆకట్టుకోవడానికి ఆయా ఊర్లతో తనకు బాగా అనుబంధం ఉందని చెప్పి నవ్వులపాలయ్యేవారు. పుట్టిన, పెరిగిన ఊర్లు, చదివిన ప్రాంతాల విషయంలో అనేక పేర్లు చెప్పారు. తీరా చూస్తే అదంతా అబద్ధమని తేలిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఒకవేళ కాకినాడ ఎంపీగా కాకపోయినా ఇంకేదైనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దిగినా అవే మాటలు చెప్తాడు. కాకపోతే ఊరి పేరు మారుతుందంతే.. దీనిని సోషల్ మీడియాలో కవర్ చేయలేక జనసైనికులు అల్లాడిపోవాలి.