ఇప్పటివరకూ ఆంధ్ర రాష్ట్రాల్లో ఆయా పార్టీ అధ్యక్షులు రెండేసి చోట్ల పోటీ చేసి గెలిచి, రెండిటిలో ఏ సీటు ఆయన వదిలేస్తాడా అని ప్రజలు కంగారు పడటమే మనం చూసాం. కానీ తొలిసారి పవన్ కళ్యాణ్ ఆ చరిత్రకు చరమగీతం పాడనున్నారు.
అసలు ఒక పార్టీ కి అధ్యక్షుడు అయ్యి ఉండీ, పైగా చేవ చచ్చిన టీడీపీకి మనమే ఊపిరి అని బీరాలు పోయి, అధఃపాతాళానికి ప్రస్తుత ముఖ్యమంత్రిని తొక్కేస్తానని బెదిరించి… ఇన్ని రకాల విన్యాసాలు చేసిన వారిని ఎవరైనా సరే కనీసం పది చోట్ల పోటీ చేసినా గెలుస్తాడేమో అని జనం అనుకునేంత సీను ఉంటుంది.
కానీ జనసేనాని వాటన్నిటినీ తుడిచిపెట్టేసారు. భీమవరం నుంచని ఒకేసారి, కాపులెక్కువ కాబట్టి పిఠాపురం నుంచి అని మరోసారి పీలర్లు వదిలారు కానీ, నిజానికి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేక ఉన్నారు. ఎక్కడ పోటీ చేసినా లెక్కలు తప్పేట్టు గానే ఉండటంతో ఎటూ తోచని స్థితిలో పడిపోయారు. తాజాగా ఆయన భీమవరమూ కాదు పిఠాపురమూ కాదు తిరుపతి నుంచి పోటీలో దిగుతున్నారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
పైగా తిరుపతిలో పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వంపై ఐవీఆర్ కాల్స్ కూడా వస్తున్నాయి. అంటే పొత్తు నుంచి ఇంకా అభ్యర్థి నిర్ణయమవలేదా? భీమవరం పిఠాపరాలలో ఆయన ఓడిపోతారని సర్వేలు చెప్పాయో ఏంటోనన్న అయోమయంలో జనసైనికులు బుర్రలు బద్దలుకొట్టుకుంటున్నారు. మొత్తమ్మీద ఒక తరహా కొత్త నేతృత్వానికి పవన్ తెర లేపారు.