ఏబీఎన్ స్టాఫ్ ఫొటోగ్రాఫర్ పై దాడి పై పవన్ కళ్యాణ్ ఖండన హాస్యాస్పదం.
గురివింద గింజ తన నలుపు ఎరుగదు అనట్టు ఉంది జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వ్యవహారం. కనీసం జరిగిన ఘటనను ఖండించేందుకు తనకి అర్హత ఉందాలేదా అని కూడా చూసుకోకుండా వైసీపీ అనేసరికి నీతులు వల్లించడం పవన్ కళ్యాణ్ కి పరిపాటిగా మారింది. దీనికి ఉదాహరణ నిన్నటి రోజున రాప్తాడు సిద్దం సభను కవర్ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై జరిగిన దాడిని పవన్ కళ్యాణ్ ఖడించడం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు నైతిక విలువలు వదిలేసి యాజమాన్యం మెప్పు కోసం వారి రాజకీయ అవసరాల కోసం అసత్యాలతో, అర్ధసత్యాలతో ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలో భాగంగా నిత్యం ప్రత్యర్ధులపై బురదజల్లే కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇందులో మొదటి వరసలో ఉండేవారు ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహాన్యూస్, టీవీ5 యాజమాన్యాలు.
నిన్నటి రోజున రాప్తాడులో జగన్ సభను కవర్ చేయడానికి వెళ్లిన ‘ఆంధ్రజ్యోతి’ అనంతపురం స్టాఫ్ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణ అక్కడికి వచ్చిన వారితో నీకు ఎంత ఇచ్చారు సభకు రావడానికి అంటూ చులకనగా మాట్లాడేసరికి అభిమానంతో వచ్చిన వారు కోపోదృతులై దాడికి పాల్పడ్డారనే వార్తలు వస్తున్నాయి. యాజమాన్యం మెప్పు కోసం నైతిక విలువలు వదిలేసిన జర్నలిస్టులని ఎలాగైతే సమర్దించలేరో. రిపోర్టర్లపై భౌతిక దాడిని కూడా ఎవరు సమర్దించరు. కానీ ఈ దాడులని ఖండిచే హక్కు పవన్ కళ్యాణ్ కి ఉందా అనేది ప్రశ్న?
పవన్ కళ్యాణ్ తన అన్న కూతురు సుస్మితా, హీరో ఉదయ్ కిరణ్ నిశ్చితార్థం కవర్ చేయడానికి వచ్చిన ఆంధ్రభూమి విలేఖరి అబ్దుల్, ఫోటో గ్రాఫర్ దుర్గారావు మీద తానే స్వయంగా బౌతిక దాడి చేసి వారి కెమెరాలు లాక్కుని పగలకొట్టలేదా? అది పత్రికలలో రాలేదా. అలాగే తన తల్లిని తిట్టారని చెబుతూ ట్విట్టర్ వేదికగా మీడియా అధినేతలపై విమర్శలు గుప్పిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్లు చేస్తూ వారి అభిమానులని వారిపైకి ఉసిగొలిపే ప్రయత్నం చేయలేదా?.
సోషల్ మీడియాలో జన సైనికుల చేత అత్యంత హేయంగా తిట్టించలేదా? ఇన్ని చేసిన పవన్ కళ్యాణ్ కి దాడిని ఖండిoచే నైతిక హక్కు ఎక్కడ ఉంది ? తాను చేసిన దాడులకి కనీసం ఏరోజూ కూడా క్షమాపణ చెప్పని పవన్ కళ్యాణ్ ఇప్పుడు నీతులు చెప్పడం ఆశ్చర్యమే కాదు హాస్యాస్పదం కూడా.