‘తెలుగుదేశం సీట్లు ఇవ్వడం.. చేయి చాచి జనసేన తీసుకోవటం ఏమిటి? జనసేనకు 24 సీట్లకు మించి నెగ్గగల సత్తా లేదా? పార్టీ పరిస్థితి అంత హీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కళ్యాణ్ చెప్పగలరా?’ అని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామజోగయ్య ప్రశ్నించారు. పొత్తులో భాగంగా శనివారం జరిగిన సీట్ల ప్రకటనపై సీరియస్ అవుతూ ఆయన లేఖ రాశారు. ఇందులో పవన్ తీరుపై విరుచుకుపడ్డారు.
కమ్మలకు 24 సీట్లు, రెడ్లకు 17, కాపులకు 15, బీసీలకు 25 సీట్లు ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయంగా బీసీలకు 50 శాతం, కాపులకు 25, కమ్మవారికి 4, రెడ్లకు 6 శాతం సీట్లు దక్కాలి. కానీ ఏ ప్రాతిపదికపై సీట్ల కేటాయింపు జరిగిందని ప్రశ్నించారు. జనసేనకు ఇచ్చిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లపై ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు అసంతృప్తి ఉన్నారు. అసలు జన సైనికుల గౌరవానికి తగ్గట్లు పంపకం జరిగిందా. అయినా ఒకరు ఇవ్వడం, మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవడం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా? అని పవన్ను నిలదీశారు.
ఆర్థికంగా బలమైనవారు ఉండి, జనసేనకు సామాజికపరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60 ఉన్న మాట వాస్తవం. ఆయా నియోజకవర్గాల్లో వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ఇచ్చాను. బలమైన అభ్యర్థుల ఆధారంగానే 24 నియోకవర్గాలను ఎంపిక చేశామని పవన్ చంద్రబాబుకు వంత పాడటం ఎందుకు?, జనసేన శక్తిని సేనాని ఎందుకు తక్కువ అంచనా వేసుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ 24 నియోజకవర్గాల కేటాయింపు అధిక సంఖ్యాకులైన జన సైనికులను సంతృప్తి ఇవ్వలేదు. వారు కోరుకుంటోంది రాజ్యాధికారంలో గౌరవమైన వాటా. అది సీట్ల పంపకంలో జరిగినప్పుడే పరిపాలనాధికారం కూడా దక్కుతుంది. సేనాని కనీసం రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలనేది సేన కార్యకర్తల కోరిక. అయితే తక్కువ సంఖ్యలో సీట్ల కేటాయించడంతో ముందు ముందు అధికారంలో వాటా ఉండదనేది వారి ఆవేదన. అధికారం చేజిక్కించుకోకుండా పవన్ కలలుగంటున్న రామ రాజ్యం స్థాపించుకోలేమన్నది వారి భయం.
జనసేన ఓట్లు సవ్యంగా ట్రాన్స్ఫర్ కాకుండా తెలుగుదేశం గెలవలేదనేది 2019 లెక్కలు చెబుతున్నాయి. అయినా జన సైనికులను సంతృప్తి పరచకుండా వైఎస్సార్ కాంగ్రెస్ను ఎలా ఓడించగలుగుతామని కూటమి నాయకులు నమ్ముతున్నారో తెలియడం లేదు. ఎలాగూ ఎమ్మెల్యే స్థానాలు తక్కువ తీసుకున్నారు. కనీసం పొత్తు ధర్మంలో భాగంగా ముఖ్యమంత్రి పదవిని పవన్ తీసుకోవాలి. చెరిసగం మంత్రి పదవులు దక్కాలి. ఈ మాట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడి నోటి వెంట స్వయంగా చెప్పించాలి. ఈ రకమైన ప్రకటన విడుదలైతేనే జన సైనికులందరూ సంతృప్తి పడే అవకాశం ఉంది. ఈ సంక్షోభానికి ఇదే మాత్ర అని జోగయ్య అభిప్రాయపడ్డారు.
జోగయ్య ఇప్పటికే అనేక లేఖలు రాశారు. ప్రతి దాంట్లో పొత్తులో పవన్ వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు. కాపు, తూర్పు కాపులకు 40 సీట్లు తీసుకోవాలి. మరో 23 ఇతర కులాల వారి కోసం అడగాలని సూచించారు. అభ్యర్థుల పేర్లను కూడా ఇచ్చారు. కానీ పవన్ ఆ లేఖలను పరిగణలోకి తీసుకోలేదు. జోగయ్య తాజా అంచనా ప్రకారం పొత్తులో సీట్ల సర్దుబాటు సక్రమంగా జరగలేదు. టీడీపీని అడుక్కుని ఏవో కొన్ని స్థానాలు తీసుకున్నారని జనసైనికులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీంతో సంక్షోభం ఉంది. దీనిని సీఎం పదవి షేరింగ్తో నివారించాలని సూచించారు. కానీ ఇది జరిగే పనికాదు. లేఖలు రాసి రాసి హరిరామకు విసుగు రావాల్సిందే తప్ప సేనాని చెవికి ఒక్క మాట కూడా ఎక్కదు.