‘మనకి పోల్ మేనేజ్మెంట్ తెలుసా.. ఆర్గనైజేషనల్ బలం ఉందా.. సంస్థాగతంగా పాతుకుపోయిన తెలుగుదేశం పార్టీతో పోటీ పడగలమా.. ప్రతి నియోజకవర్గంలో 800 నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా.. అంతమందికి 50 రోజులపాటు ఎంతో కొంత డబ్బులిస్తూ భోజనాలు పెట్టే సత్తా మన నాయకత్వానికి ఉందా.. మనం ఇంకా ఎదుగుతూ ఉన్నాం. వెయిట్ చేయాలి’ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల తాడేపల్లిగూడెంలో జరిగిన ఉమ్మడి సభలో చేసిన వ్యాఖ్యలివి.
ఈ మాటల్ని బట్టి చూస్తే జనసేన స్థాపకుడే దాని పాలిట మెయిన్ విలన్గా మారినట్లు అర్థమవుతోంది. చంద్రబాబు నాయుడితో జత కట్టడం.. సీట్లు తక్కువగా తీసుకోవడాన్ని సమర్థించుకునేందుకు పవన్ తన పార్టీకి బలం లేదని చెప్పుకొచ్చాడు. కానీ ఈ పరిస్థితి రావడానికి కారణం ఎవరో కాదు. సాక్షాత్తు పవనే.
నిజానాకి పవన్కు రాజకీయ అనుభవం చాలా ఉంది. ప్రజారాజ్యం పార్టీలో కీలకంగా వ్యవహరించారు. యువరాజ్యం అధ్యక్షుడిగా కాళ్లకు చక్రాలు కట్టుకుని ఉమ్మడి రాష్ట్రమంతా తిరిగారు. 2009 ఎన్నికల్లో ఓటమి, కాంగ్రెస్లో పీఆర్పీ విలీనం.. వివిధ కారణాలతో ఐదేళ్లు రాజకీయాలకు గ్యాప్ ఇచ్చారు. ప్రజల కోసం ప్రశ్నిస్తానంటూ 2014లో జనసేనను స్థాపించారు. చాలా సందర్భాల్లో పార్టీని ప్రజారాజ్యంలా కానివ్వనని బలంగా తయారు చేసి రాజ్యాధికారం సాధిస్తానని అరిచి మరీ చెప్పారు.
సేనాని దశాబ్దానికి పైనుంచే పాలిటిక్స్లో ఉన్నారు. కానీ చంద్రబాబు నీడలో.. ఆయన తన జనసేనను ఎదగనివ్వలేదు. ఇది నిజం. పార్టీని అడ్డం పెట్టుకుని అభిమానుల సెంటిమెంట్లతో ఆడుకుంటూనే ఉన్నాడు. పీఆర్పీ సమయంలో జరిగిన తప్పులు సేన విషయంలో పునరావృతం కాకుండా బలంగా తయారు చేసేందుకు పూనుకొని ఉండొచ్చు. అయితే ఆ దిశగా ఎప్పుడూ అడుగులు వేయలేదు. 14లో పార్టీ పెట్టి పోటీ చేయలేదు. సరే అప్పుడే కదా పార్టీ పెట్టానని ఆయన నుంచి సమర్థన రావొచ్చు. మరి 2019 వరకు మధ్యలో ఐదేళ్లపాటు పార్టీని ఎందుకు బలోపేతం చేయలేదు.
అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా నిత్యం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై పడి ఏడ్చారు పవన్. చంద్రబాబు నాయుడి సూచనలతో పొత్తు నుంచి విడిపోయి 19 ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్ట్ పార్టీలతో కూటమి కట్టి పోటీ చేశారు. జనసేన వందకు పైగా స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. పవన్ రెండు చోట్ల ఓడిపోయారు. రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి సేనను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాల్సింది పోయి చేతులెత్తేశారు.
2019 నుంచి 24 మధ్య ఏమి చేశాడయ్యా అంటే.. సినిమాల షూటింగ్ గ్యాప్లో హైదరాబాద్ నుంచి ఏపీకి రావడం.. జగన్ను తిట్టడం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురద వేయడం.. ఎప్పుడో ఒకసారి నాయకులతో మీటింగ్లు పెట్టి నోటికొచ్చింది మాట్లాడి పోవడం తప్ప పార్టీపై దృష్టి పెట్టిన పాపాన పోలేదు. మధ్యలో బీజేపీతో పొత్తులో ఉంటూనే.. ఇంకోవైపు చంద్రబాబుకు ప్రేమను పంచాడు. ఎన్నికల నేపథ్యంలో ఏకంగా టీడీపీతో కూటమి కట్టాడు.
పార్టీ పెట్టిన పదేళ్ల తర్వాత కూడా పోల్ మేనేజ్మెంట్ తెలియదు.. బూత్ కార్యకర్తలు లేరనే పరిస్థితికి దిగజారారు. వివిధ కార్యక్రమాల పేరుతో రూ.కోట్లలో విరాళాలు దండారు. పవన్ కూడా మొన్నామధ్య ఎన్నికల కోసం రూ.10 కోట్లు విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. మరి బూత్ కార్యకర్తలకు 50 రోజులపాటు ఎంతో కొంత డబ్బులిచ్చి భోజనాలు పెట్టే సత్తా లేదని చెప్పడాన్ని బట్టి చూస్తే సేన పాలిట అసలైన విలన్ పవన్ అని స్పష్టమవుతోంది.
జనసేన గురించి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఊహించుకుంటుంటారు. 19 ఎన్నికల సమయంలో ప్రత్యర్థులను చిత్తు చేసే వ్యూహాలను పవన్ పన్నాడని సోషల్ మీడియాలో డబ్బా కొట్టారు. తీరా జానీ సినిమా కంటే దారుణంగా సేన ఫ్లాప్ అయ్యింది. అయినా సరే మావాడు ఓడిపోయినా సీఎమ్మే బ్రో అంటూ పాటలు పాడి ఖుషీ అయ్యారు కొందరు అభిమానులు. అప్పట్లో కర్ణాటకలో కుమారస్వామి సీఎం అవ్వగానే.. ఇక్కడ పవన్ చక్రం తిప్పి కింగ్ మేకర్ అవుతాడు. ఏపీకి ఆయనే కాబోయే సీఎం అన్నారు. కనీసం ఎమ్మెల్యే కూడా కాలేకపోయాడు. ఇప్పటికీ జనసైనికులు గాల్లో మేడలు కడుతున్నారు. కానీ అధినేత మాత్రం మన పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఎదుగుతూనే ఉన్నామని ఆ మేడల్ని ఎప్పటికప్పుడు నిట్టనిలువునా కూల్చేస్తుంటాడు.
పవన్ వ్యవహారశైలిని చూస్తుంటే ఎప్పుడూ అభిమానులను ఊరించడమే తప్ప వారి కలలను సాకారం చేసేందుకు అడుగులు వేయడని అర్థమైపోయింది. 14లో పెట్టిన పార్టీ ఇంకా ఎదుగుతూనే ఉంది. పాపులర్ హీరోనని, తనకు అభిమానులు కాదు భక్తులున్నారని చెప్పుకొనే సేనాని ఇటీవల చంద్రబాబు 24 సీట్లు ఇచ్చినా అవే చాలా ఎక్కువ అన్నట్లుగా తీసుకున్నారు. ఏ పార్టీ అయినా పొత్తులో ఎక్కువ సీట్లు తీసుకుని.. పదవుల్లో షేరింగ్ అడుగుంతుంది. కానీ పవన్ అలా చేయకుండా చంద్రబాబును అందలం ఎక్కించాలని చూస్తున్నాడంటే ఆయన నుంచి వ్యక్తిగతంగా భారీ ప్రయోజనం పొందినట్లే కదా.. జనసేనను స్థాపించినోడే చేతులారా నాశనం చేస్తున్న విషయం ఇప్పటికే కాపులకు అర్థమైపోయి దూరం జరిగారు. ఇక మిగిలిన పిచ్చి అభిమానులు గ్రహించిన నాడు పవన్ను ఛీ కొట్టడం ఖాయం.