పల్నాడు జిల్లా టీడీపీలో ఇప్పుడు పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది. చంద్రబాబు టికెట్ రాజకీయాల దెబ్బకి ఎవరు ఎక్కడ నుంచి పోటీ చేస్తారు, ఎవరికి టికెట్ లభించనుందో అని ఆశావహులు, పాత అభ్యర్థులు అందరూ అయోమయ స్థితిలో ఎదురు చూస్తూ ఉన్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఏడు ఎమ్మెల్యే సీట్లను వైసీపీ కైవసం చేసుకున్న వేళ, టీడీపీ సీనియర్ నాయకుడు యరపతినేని, ఆర్థికంగా బలవంతుడైన కొమ్మాలపాటి శ్రీధర్, సత్తెనపల్లి నుంచి మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావుసహా హేమాహేమీలందరూ వైసీపీ దూకుడు ముందు తట్టుకోలేక ఓటమి చెందారు.
తర్వాత పల్నాడులో పలు కారణాలతో టీడీపీలో సీనియర్ నాయకులెవరూ క్రియాశీలకంగా వ్యవరించలేదు. కోడెల అకాల మరణం చెందగా, పత్తిపాటి పుల్లారావు నాలుగు సంవత్సరాలు సైలెంట్ గా ఉండిపోయారు. యరపతినేని సీబీఐ కేసుల్లో ఇరుక్కుని కొంతకాలం దూరంగా ఉన్నారు కేవలం గత ఏడాదిన్నరగా మాత్రమే రాజకీయంగా క్రియాశీలకంగా ఉన్నారు. ఈ ఎన్నికలకు మాచర్లలో వివాదాస్పద ఫ్యాక్షన్ నాయకుడు జూలకంటి బ్రహ్మారెడ్డిని, సత్తెనపల్లిలో ఇటీవల పార్టీలో చేరిన కన్నాను ఇన్చార్జిలుగా ప్రకటించారు. అయితే బ్రహ్మా రెడ్డి అనునిత్యం వివాదాస్పదంగా వ్యవహారిస్తూ మాచర్లలో ఆశాంతికి కేంద్ర బిందువుగా వ్యవహారిస్తుండగా పెదకూరపాడు నుంచి కొమ్మాలపాటి శ్రీధర్, చిలకలూరిపేట నుండి పుల్లారావు యాక్టీవ్ పాలిటిక్స్ లో అంతగా కనపడట్లేదు. కూరపాడు నుండి కొమ్మాలపాటికి కాకుండా మరొక అభ్యర్థికి ఇద్దామని ఆలోచిస్తున్నా, ఎవరికి ఇవ్వాలా అనేది మాత్రం ఇంకా తేలలేదు. కానీ కొమ్మాలపాటి శ్రీధర్ కు మాత్రం టికెట్ లేనట్లే అని చెప్పుకోవచ్చు.
అయితే, ఇటీవల చంద్రబాబు మాచర్ల నియోజకవర్గం నుంచి జూలకంటి బ్రహ్మారెడ్డిని, వినుకొండకు జీవీ ఆంజనేయులుని, చిలకలూరిపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావునీ, సత్తెనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ని ఇలా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకే అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన మూడు నియోజకవర్గాలకి అభ్యర్థులను ప్రకటించలేదు. అందులో టికెట్ రాని వారుగా టీడీపీ సీనియర్ నాయకుడు… ఆర్ధికంగా బలవంతుడైన యరపతినేని, కొమ్మాలపాటి శ్రీధర్, నరసరావు పేట నుంచి అభ్యర్థి వివరాలూ ప్రకటించలేదు.
ప్రత్యేకించి నరసరావుపేట నియోజకవర్గాన్ని గమనిస్తే 2019 లో పోటీ చేసి ఓడిపోయిన డాక్టర్ చదలవాడ, అరవిందబాబు బలమైన బీసీ నాయకుడు. అతను అప్పటి నుంచీ నియోజకవర్గంలో పట్టుకు కృషి చేస్తూ ఉన్నా, నల్లపాటి రాము, కడియాల రమేష్ అనే ఇద్దరు ఆశావహులను తన సొంత సామాజిక వర్గం నుంచి స్వయంగా పెంచి పోషించి అతనికి చెక్ పెట్టే విధంగా పొమ్మనకుండా పొగ పెట్టారు చంద్రబాబు.
తీరా ఎన్నికల వేళ వైసీపీ రాష్ట్రకార్యదర్శిగా ఉన్న అటలా చిన వెంకటరెడ్డి కి టికెట్ ఇవ్వాలని, ఈ ముగ్గురు గెలవడానికి పనికిరారని, అభ్యర్థి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారైతే ఆ సామాజిక వర్గ ఓట్లు చీల్చే అవకాశం ఉంటుందని అని అతనిని తెరపైకి తీసుకొచ్చారు.
మరొక వైపు వైసీపీలో, ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాతో ఆ స్థానంలో బీసీ నేత అనిల్ కుమారును వైసిపి ఇన్చార్జి చేయడంతో టీడీపీ డైలమాలో పడింది. మళ్లీ బీసీ జపం కోసం వైసీపీ నుంచి జంగా కృష్ణమూర్తిని టీడీపీ నుండి నరసరావుపేటలో పోటీ చేయమని ఇటీవల కాలం వరకు చంద్రబాబు ఒత్తిడి చేశారు. అయితే జంగా కృష్ణమూర్తి నరసరావుపేట పోటీ చేయననీ, నాకు గురజాల కావాలి అన్న నేపథ్యంలో మళ్లీ ఇపుడు యరపతినేనిని నరసరావు పేట నుంచి పోటీ చేయించే ఉద్దేశంతో ఐవీఆర్ కాల్స్ ద్వారా అతని అభ్యర్ధిత్వాన్ని పరీక్షిస్తున్నారు. ఈ విధంగా పల్నాడు జిల్లాలోని టీడీపీ నాయకులతో, అసెంబ్లీ స్థానాలతో, వారి మనోభావాలతో రాజకీయ జూదం ఆడుతూ చంద్రబాబు పల్నాడు టీడీపీ నాయకుల్ని త్రిశంఖు స్వర్గంలో వేలాడదీశారు చంద్రబాబు.