కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గాను మార్చి 12 నుంచి అడ్మిషన్ల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. కస్తూర్బా గాంధీ విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 352 ఉన్నాయి, ఈ విద్యాలయాలను సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడపబడుతున్నాయి. కస్తూర్బా గాంధీ విద్యాలయాల ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వమే పిల్లలకి ఉచిత విద్య , ఉచిత హాస్టల్ వసతిని ఏర్పాటు చేస్తుంది. ఈ విద్యాలయాలలో 6వ, 11వ తరగతుల్లో ప్రవేశం కోసం 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మార్చి 12వ తేదీ నుంచి ఏప్రిల్ 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ విద్యాలయాల్లో చదువుకోవడానికి అందరికీ అవకాశం ఉండదు. అనాథలు, బడి బయట పిల్లలు, బడి మానేసిన పిల్లలు (డ్రాపౌట్స్) ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ , బిపిఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. అప్లై చేసుకునే బాలికల కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏడాదికి 1,20,000, పట్టణ ప్రాంత విద్యార్థులకు ఏడాదికి 1,44,000 మించకూడదు. ఆన్లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు మాత్రమే అడ్మిషన్ల కొరకు పరిగణిస్తామన్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందుతుందని, విద్యార్థులు ఎంపికైన విద్యాలయాల నుంచి ఫోన్ ద్వారా సమాచారం అలాగే విద్యాలయాల నోటిఫికేషన్ బోర్డులలో వివరాలను నేరుగా చూసుకోవచ్చని శ్రీనివాసరావు తెలిపారు. అప్లై చేసే విధానంలో ఏమైనా డౌట్లు ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 సంప్రదించాలని ఈ సందర్భంగా తెలియజేశారు.