పెనములూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారధిని టీడీపీ పార్టీ నూజివీడు అభ్యర్థిగా టీడీపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశానుసారం కొలుసు పార్థసారధి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసినట్లు తెలిపారు. నూజివీడుతో పాటుగా ఏలూరు ఇంచార్జిగా కూడా పార్థసారధిని నియమించారు. ఇందులో కొసమెరుపు ఏంటి అంటే కొలుసు పార్థసారధి ఇప్పటివరకు టీడీపీ కండువా మేడలో వేసుకోలేదు. కాగా ఈ ప్రకటన చేసిన ఒక గంటకే టీడీపీ పార్టీకి షాక్ తగిలింది.
నూజివీడు టీడీపీ ఇంచార్జి ,సీనియర్ నాయకుడు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీకి రాజీనామా చేశారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ కష్టకాలంలో టీడీపీ పార్టీనీ బలోపేతం చేయడానికి ఎంతో కృషి చేసాడు. 2014 నుంచి నూజివీడులో ఛిన్నాభిన్నమైన పార్టీనీ ఒకే తాటి పైకి తెచ్చి పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, సొంత డబ్బును ఖర్చు పెట్టుకొని, నూజివీడులో టీడీపీ పార్టీ కార్యలయంను సొంత డబ్బుతో కట్టిస్తే తనకు ఇచ్చే గౌరవం ఇదా, చంద్రబాబును నమ్ముకొని ఉంటే తనకు అన్యాయం చేసాడు అని మీడియా ముఖంగా తెలిపారు. నూజివీడు టికెట్ తనదేనంటూ చంద్రబాబు రెండుసార్లు తనకు హామీ ఇచ్చారని, ఇప్పుడు అనివార్య కారణాలు అనే పేరుతో తనను తప్పించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ఇప్పటివరకూ పార్టీ కండువాను కప్పుకోని వైసీపీ నాయకుడికి టికెట్ ఎలా ఇస్తారని నిలదీశారు.దీనికి నిరసనగా తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వెంకటేశ్వరరావు తన పార్టీ ఆఫీస్ నుంచి టీడీపీ జెండాలు, ఫోటోలను తొలిగించారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు తన అనుచరులతో మాట్లాడి రాజకీయ భవిష్యత్తు త్వరలోనే ప్రకటిస్తాను అని ఈ సందర్బంగా తెలిపారు.