నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిపర్యటన పేలవంగా సాగుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు, టికెట్లు రాని నేతలు హ్యాండ్ ఇచ్చారు. బాబు హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం కావలి పట్టణంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్నారు. అక్కడి నుంచి మూడు గంటలకు రోడ్డు మార్గంలో ఎన్టీఆర్ విగ్రహం సమీపానికి చేరుకుని సభ నిర్వహించాలి. కానీ అనుకున్న షెడ్యూల్ ప్రకారం పర్యటన జరగడం లేదు.
జన సమీకరణలో కావలి టీడీపీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి విఫలమయ్యారు. టికెట్ ఆశించి దక్కకపోవడంతో మాలేపాటి సుబ్బానాయుడు లైట్ తీసుకున్నారు. ఈ నియోజకవర్గానికి చెందిన బీద రవిచంద్ర తనకేం పట్టనట్లుగా ఉండిపోయారు. నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నేను పార్టీలోకి కొత్తగా వచ్చాను.. ఇక్కడి విషయాలు పెద్దగా తెలియదు. డబ్బు కావాలంటే ఇస్తానని తప్పించుకున్నారు. సభ వద్ద జనం లేరనే విషయం బాబు చెవిలో పడడంతో సుమారు గంటపాటు హెలిప్యాడ్ వద్దే ఉండిపోయి నేతలకు క్లాస్ పీకారు. డబ్బులిచ్చి కార్యకర్తల్ని తరలించడంలో కృష్ణారెడ్డి విఫలమయ్యారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వాస్తవానికి బాబు మధ్యాహ్నం 2.50 నిమిషాలకే ప్రత్యేక హెలికాప్టర్లో గ్రౌండ్లో దిగారు. కానీ అక్కడి నుంచి వెళ్లకుండా అసంతృప్తిలో ఉండిపోయారు.
దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేస్తున్న తెలుగు తమ్ముళ్లు కావ్య కృష్ణారెడ్డి తీరుపై మండిపడుతున్నారు. మధ్యలో వచ్చి డబ్బులిచ్చి టికెట్ కొనుక్కున్నాడని, ఇతనికి బాబుపై అభిమానం ఉండదని రుసరుసలాడుతున్నారు. ఆయన ఓవరాక్షన్ కారణంగానే అధినేత పర్యటన ఫైయిలవుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు నేతలు కావ్యపై బాబుకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ సభే ఇంత దారుణంగా జరిగితే ఇక ఉదయగిరి పర్యటనను ఊహించుకుని అక్కడి కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఆ నియోజకవర్గంలో కూడా అభ్యర్థి మారిపోయాడు. నేతల మధ్య పొసగడం లేదు.