తెలుగుదేశం నీళ్లు అప్పుడే బాగా ఒంటపట్టించుకున్నాడు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు. అసలు తాను ఏ కారణంతో అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడాడో అప్పుడే మర్చిపోయి.. ఎన్నికల వేళ బీసీల ఓట్ల కోసం ఆస్కార్ స్థాయి నటనను అందుకున్నాడు.
సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. శ్రీకృష్ణదేవరాయులుకు నరసారావుపేట పార్లమెంట్ టికెట్ ఇచ్చి గెలిపించారు. పార్టీలో ఎంతో గౌరవం దక్కింది. పనులన్నీ చేయించుకున్నారు. ఈసారి ఆ స్థానాన్ని బీసీకి ఇద్దామని, మరోచోట నుంచి పోటీ చేయాలని లావుకు జగన్ చెప్పారు. అంతే.. ఎంపీలోని అగ్రవర్ణుడికి కోపం వచ్చేసింది. తన నిజస్వరూపం బయటపెట్టారు. బీసీకి ఇస్తే సహించేది లేదని, నేనే పోటీ చేస్తానని పట్టుపట్టారు. వెనుకబడిన వర్గాలను చట్టసభల్లోకి తీసుకెళ్లే విషయంలో వెనక్కి తగ్గనని జగన్ తేల్చేశారు.
తనకు నరసారావుపేట ఎంపీ సీటు ఇవ్వరని స్పష్టం కావడంతో లావు వెంటనే చంద్రబాబు పల్లకి అందుకున్నారు. ఎంతైనా ఆయన పెత్తందారులంరికీ హెడ్ కదా.. శ్రీకృష్ణదేవరాయులు పచ్చ కండువా కప్పుకోగానే సంబరపడిపోయారు. జగన్ నరసారావుపేట పార్లమెంట్ వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా నెల్లూరు సిటీ ఎమ్మెల్యే డాక్టర్ పి.అనిల్కుమార్ యాదవ్ను కొద్దిరోజుల క్రితమే ప్రకటించేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీల్లో ఫాలోయింగ్ ఉన్న అనిల్ అక్కడి నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజల ఆదరణ పొందుతున్నారు.
బీసీకి టికెట్ ఇస్తున్నారని అలిగిన వ్యక్తికి ఇప్పుడు వారి ఓట్లు కావాల్సి వచ్చాయి. మంగళగిరిలో మంగళవారం జరిగే జయహో బీసీ సభకు తరలిరావాలంటూ లావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాన్ని చూసిన జనం అవాక్కయ్యారు. పెత్తందారీ పోకడలున్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్, కన్నా లక్ష్మీనారాయణ, బ్రహ్మానందరెడ్డి, పత్తిపాటి పుల్లారావు, యరపతినేని తదితరుల ఫొటోలు వేసి బీసీ సోదరులా తరలిరండి.. బాబు బీసీ డిక్లరేషన్ ప్రకటిస్తున్నారు. జయమో గర్జించండని పిలుపునివ్వడం విశేషం. పోస్టర్లో కూడా ఎక్కువ మంది బీసీల ఫొటోలు వేసేందుకు శ్రీకృష్ణదేవరాయులు మనసు అంగీకరించలేదు. ఇక అలాంటి వ్యక్తి పిలుపునిస్తే నమ్మి వచ్చేందుకు వెనుకబడిన వర్గాలు సిద్ధంగా లేవు. అసలు ఆ సభకు జయహో బీసీ కాకుండా జయహో పెత్తందారీ అని పేరు పెట్టుంటే బాగుండేదని కామెంట్లు వచ్చాయి. ఎందుకంటే పేరుకు అది బీసీ సభ అయినా వేదికను అలంకరించేంది కృష్ణదేవరాయులు లాంటి పెత్తందారీ మనస్తత్వం ఉన్న వారే కదా..