జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు అనకాపల్లి ఎంపీ సీటునుండి పోటీకి దిగనున్నారనే ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్లే నాగబాబు అచ్చుతాపురంలో ఓ ఇల్లు తీసుకుని ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నాలు కూడా చేశారు. ఏమైందో ఏమో తెలియదు కానీ నాగబాబు అనకాపల్లి ఎంపీగా పోటీ నుండి తప్పుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు అనకాపల్లి ఎంపీగా బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్ పోటీ పడనున్నారని వార్తలు వస్తున్నాయి.
పొత్తుల్లో భాగంగా జనసేనకు ముందు మూడు ఎంపీ సీట్లను కేటాయించినా తరువాత బీజేపీకి ఒక ఎంపీ సీటును పవన్ కళ్యాణ్ త్యాగం చేయడంతో జనసేన రెండు ఎంపీ సీట్లకు పరిమితమయింది. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సీట్లలో జనసేన అభ్యర్థులు పోటీ పడబోతున్నారు. మచిలీపట్నంలో బాలశౌరి పోటీ చేస్తుండగా కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు రాజకీయవర్గాల్లో చర్చ నడిచింది. కాగా తనకు ఎంపీగా పోటీ చేయడంపై ఆసక్తి లేదని, పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగనున్నానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాగబాబు ఎక్కడనుండి పోటీ చేయబోతున్నారనే ఆసక్తి రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.