ప్రజాగళం సభ వెలవెలబోయింది. దీనిని కవర్ చేసుకోవడానికి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. మొత్తం నెపాన్ని పోలీసులపై నెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఎల్లో మీడియా కూడా ఆ రకంగానే వార్తలను వడ్డిస్తోంది. ఆదివారం పల్నాడు జిల్లా బొప్పూడిలో సభ జరగ్గా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. అందరూ కలిసి పొత్తు పెట్టుకున్నాక జరిగిన మొదటి సభ ఇది.
టీడీపీ జనసమీకరణ చేయలేకపోయింది. జనసైనికులు, కమలం కార్యకర్తలు అంతంతమాత్రంగానే వచ్చారు. చంద్రబాబు స్వయంగా అభ్యర్థులకు చెప్పినా పట్టించుకోలేదు. తెలుగు తమ్ముళ్లకు మద్యం, నగదు ఇచ్చి విద్యాసంస్థల బస్సుల్లో తరలించి మమ అనిపించారు. హైవేపై వాహనాలను అడ్డం పెట్టి డ్రోన్లతో ఫొటోలు తీసి జనం లక్షల్లో వచ్చారని ప్రచారం చేశారు. కానీ ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో ఎల్లో గ్యాంగ్ బాధ వర్ణనాతీతం. దీనికితోడు ప్రధాని మాట్లాడుతుండగా పలుమార్లు మైక్ పనిచేయలేదు. ఆయన్ను సన్మానించేందుకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురాలేదు. దీంతో ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్రలకు తెరలేపారు. ఆదివారం రాత్రి నుంచి పోలీసుల వైఫల్యం వల్ల భారీగా ప్రజలు బయటే ఉండిపోయారని ప్రచారం ప్రారంభించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రెస్మీట్ పెట్టి పోలీసులపై విరుచుకుపడ్డారు. ఓ పక్క పోలీసులు ప్రజలను ఇబ్బంది పెట్టారంటూనే మరోవైపు సభ విజయవంతమైందని రెండు విధాలుగా మాట్లాడారు. అధికారుల తీరుపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర కూడా పోలీసులదే కారణమని ఆరోపించారు. వాళ్లంతా ఇంకా వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం కనుసన్నల్లోనే పనిచేస్తున్నారని చెబుతున్నారు.
ప్రధాని మోదీ పాల్గొన్న సభను విఫలం చేయాలని పోలీసులు అనేక ప్రయత్నాలు చేశారని పలువురు నేతలు చంద్రబాబు దృష్టికి నేతలు తీసుకెళ్లారు. సోమవారం ఉండవల్లిలోని నివాసంలో ఆయన్ను కలిసి చర్చించారు. అధికార పార్టీ ఒత్తిడితో సభకు పోలీసులు అనేక ఆటంకాలు కలిగించారన్నారు. కానీ ఇది నిజం కాదు. సభ ఫెయిలవడంతో టీడీపీ, జనసేన, బీజేపీలు సరికొత్త నాటకానికి తెరలేపాయి. అసలు ఎన్నికల కోడ్ వచ్చాక యంత్రాంగమంతా ఈసీ చేతుల్లో ఉంటుంది. ఈ విషయం సదరు సీనియర్ నేతలకు తెలిసి కూడా జగన్ పార్టీపై బురద వేస్తున్నారు. సభ నిర్వహించడం చేత కాక కట్టు కథలు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి టీడీపీ పోలీసు వ్యవస్థపై పడి ఏడుస్తోంది. కోడ్ వచ్చాక కూడా అదే పాట పాడుతోంది.