ఏపీలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ – జనసేన కూటమిగా పోటీ చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ కూటమిలో భాగంగా జనసేనకు కేవలం 24 సీట్లు మాత్రమే కేటాయించడంతో జనసేన కార్యకర్తలు ఆవేదనతో రగిలిపోతున్నారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు తక్కువ సీట్లకే లొంగిపోవడం జనసైనికులకు మింగుడు పడటం లేదు. ఇప్పటికే మూడొంతుల సీట్లలో పోటీకి దిగాలని చేగొండి హరిరామ జోగయ్య ఇప్పటికే పలు బహిరంగ లేఖల ద్వారా పవన్ కళ్యాణ్ ను హెచ్చరించిన విషయం తెలిసిందే. తాజాగా ముద్రగడ పద్మనాభం పవన్ కళ్యాణ్ కు ఘాటు లేఖను రాసారు. పవన్ విధానాలను విమర్శిస్తూనే పవన్ నిర్ణయాలు తన చేతుల్లో లేవంటూ దుయ్యబట్టారు. ముద్రగడ లేఖలో ఏం పేర్కొన్నారంటే..
మిత్రులు గౌరవ పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్మనాభం నమస్కారములు..
2019 ఎన్నికల ముందు కవాతు సందర్భముగా కిర్లంపూడి వస్తానని కబురు పంపారు. అయోధ్య వెళ్ళొచ్చిన తరువాత కిర్లంపూడి వస్తానని మరోకసారి కబురు పంపించారు. ఎటువంటి కోరికలు లేకుండా మీతో కలుస్తానని చెప్పడం జరిగిందండి. అన్ని వర్గాలకు న్యాయం జరగడం కోసం పార్టీని ముందుకు తీసుకువెళ్ళడానికి నావంతు కృషి చేయాలని, ఎటువంటి ఫలితం ఆశించని సేవ మీతో చేయించాలని అనుకున్నానండి. మన ఇద్దరి కలయిక జరగాలని యావత్ జాతి చాలా బలంగా కోరుకున్నారండి. వారి అందరి కోరిక మేరకు నా గతం, నా బాధలు, అవమానాలు, ఆశయాలు, కోరికలు అన్ని మరచి మీతో ప్రయాణం చేయడానికి సిద్దపడ్డానండి. రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావాలని చాలా బలంగా ప్రయత్నం చేద్దామని ఆశించానండి. మీరు అదే ఆలోచనలో ఉన్నారని నమ్మానండి
కాని దురదృష్టవశాత్తు నాకు మీరు ఆ అవకాశం ఇవ్వలేదండి.చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టి.డి.పి కేడరు బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితం అయిపోయారండి. అటువంటి కష్టకాలంలో తమరు జైలుకి వెళ్ళి వారికి బరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదండి, చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందండి. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనండి. గౌరవ ప్రజలు ఇంచుమించుగా అందరూ మిమ్మలను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారండి. పవర్ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, 2 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాలండి, ఆ సాహసం మీరు చేయలేకపోవడం చాలా బాధాకరమండి. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గాని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదండి. భగవంతుడ్ని ఆపరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటానండి. కాని మీలాగ గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా మరియు తుప్పు పట్టిన ఇనుము లాంటివాడినిగా గుర్తింపు పడడం వల్ల మీరు వస్తానని చెప్పించి, రాలేకపోయారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవు, ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలండి.మీ పార్టీ పోటీచేసే 24 మంది కోసం నా అవసరం రాదు, రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానండి.
ఆల్ ది బెస్ట్…
ముద్రగడ పద్మనాభం..
కాగా కాపుల్లో బలమైన నేతగా పేరున్న ముద్రగడ పద్మనాభం తాజాగా పవన్ విధానాలను వ్యతిరేకిస్తూ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కాపు ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ను వ్యతిరేకిస్తూ కాపు నాయకుడిగా ప్రసిద్ధి చెందిన ముద్రగడ లేఖలో తన అసంతృప్తిని వ్యక్తం చేయడంఫై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.